ఏపీ డీజేపీ  రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు

ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజేపీ  రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను విధుల నుంచి వెంటనే రిలీవ్‌ కావాలని ఆదివారం సాయంత్రం ఆదేశించింది. అలాగే ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్‌ను సోమవారం ఉదయం 11 గంటలలోగా పంపించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది.

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు పదే పదే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాయి. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని సీఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి.

ఎన్నికల్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష పార్టీలు గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. ఇదే విషయమై ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు.

గతంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిచారనే దానిపై పలు ఆధారాలు కూడా అందజేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం డీజీపీపై టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నివేదికను రాష్ట్ర ఎన్నికల అధికారులు తెప్పించుకున్నారు. దాన్ని కేంద్ర ఎన్నికల అధికారులకు పంపించారు.  దీంతో రాజేంద్రనాథ్‌ రెడ్డిపై సీఈసీ తక్షణమే బదిలీ వేటు వేసింది. ఆయనకు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆదేశించింది. దీంతో పాటు ఆయన కిందిస్థాయి అధికారికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి లేఖ పంపించింది.

కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి అసలు పేరు కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. 1994లో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఏఎస్పీగా మొదటిసారి పోస్టింగ్‌ అందుకున్నారు. ఆ తర్వాత 1996లో జనగాం ఏఎస్సీగా, అనంతరం వరంగల్‌ ఏఎస్పీగా పనిచేశారు. 1996-97 మధ్య కరీంనగర్‌ ఏఎస్పీగా విధులు నిర్వహించారు. 

రాష్ట్ర విభజన అనంతరం 2015-17 మధ్య ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేశారు. 2018-19 మధ్య డ్రగ్‌ కంట్రోల్‌ డీజీగా, 2019-20 మధ్య విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. అలాగే ఇంటెలిజెన్స్‌ డీజీగాను అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2022 ఫిబ్రవరిలో ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లకు  పైగా ఇన్ ఛార్జ్ డిజిపిగా కొనసాగడం, పూర్తి స్థాయిలో డిజిపిని నియమించక పోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

కాగా, ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీవేటు వేశారు. వారిపై అందిన ఫిర్యాదులపై మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషాను ఈసీ బదిలీ చేసింది.