సజ్జల కుమారుడిపై సీఐడీ విచారణకు ఈసి ఆదేశం

సజ్జల కుమారుడిపై సీఐడీ విచారణకు ఈసి ఆదేశం

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైసీపీ సోషల్ మీడియా రథసారథి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు పట్ల ఎన్నికల సంఘం స్పందించింది. 

ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేస్తోందంటూ వర్ల రామయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  కుట్రతో, విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. 

భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్స్ ను, పింఛన్ లబ్దిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్ల రామయ్య ఫిర్యాదు ఆధారంగా వైసీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డిజి కి ఆదేశాలు జారీ చేసింది.

సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశానికి నష్టం చేకూర్చేలా వైసీపీ కుట్రలు పన్నుతోందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు. టీడీపీ నేతల్లా వేషాలు వేయించి సామాజిక మాధ్యమాల్లో ప్రజలను తిట్టిస్తూ తద్వారా పార్టీకి నష్టం చేకూర్చేలా ప్లాన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవ్ రెడ్డి, మన్విత్ కృష్ణారెడ్డి కలసి ఫేక్ వీడియోలతో ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ లబ్ది కోసం ఆ ఇద్దరితో ఇలాంటి చండాలపు పనులు చేయిస్తున్నారని విమర్శించారు. ఆ నకిలీ వీడియో వ్యవహారంపై సీఐడీతో పాటుగా ఈసీకి ఫిర్యాదు చేశారు.