బిజెపి పాలనలో మారిపోతున్న గ్రామాల రూపురేఖలు

బిజెపి పాలనలో మారిపోతున్న గ్రామాల రూపురేఖలు

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి సంకల్ప యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ రైతులు కేవలం వ్యవసాయం చేయడమే కాదు.. ఆధునిక భారత నిర్మాణంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. 

రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతాల ప్రజలు ఉపాధి అవసరాల కోసం పల్లెలకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఇప్పుడు పంటలు పండించడమే కాదు చెరకు ఉత్పత్తులతో ఇథనాల్ తయారీ చేస్తున్నారని గుర్తు చేశారు. బియ్యం, మొక్కజొన్న బార్లీ నుంచి ఇథనాల్ తయారీ జరుగుతుందని పేర్కొన్నారు. 

తన వద్ద ఇథనాల్‌తో నడిచే ఆధునిక వాహనాలున్నాయని గడ్కరీ తెలిపారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతి తగ్గి ఆ ఆదాయం రైతుల చేతిలో వెల్లబోతుందని జోస్యం చెప్పారు. నీటి నుంచి కూడా నైట్రోజన్ తయారవుతుందంటే ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా ఎదగాలనే మోదీ కలలు నెరవేరబోతున్నాయని స్పష్టం చేశారు.

గతంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందక ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని గడ్కరీ స్పష్టం చేశారు.  మహారాష్ట్రలోని ఇంగోలి వద్ద ఎంపి స్వయంగా పసుపు ఫ్యాక్టరీ స్థాపించారని, ఆ ప్రాంతంలో పసుపు సాగు బాగా పెరిగిందని అందుకే అక్కడ డ్రై పోర్టు నిర్మిస్తున్నారని తెలిపారు.

 గ్రామాల్లో రవాణా వ్యవస్థను మరింత ఆధునికరిస్తున్నామని, కశ్మీర్ నుంచి కన్యా కుమారి దాకా వేలాది కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రహదారుల కోసం గడిచిన పదేళ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. వాజపేయి హయాంలో తానిచ్చిన నివేదిక ఆధారంగానే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన అమల్లోకి వచ్చిందని చెప్పారు.

దేశంలో రూ.2 లక్షల కోట్లతో రోడ్లను ఎక్స్ ప్రెస్ హైవేలుగా నిర్మిస్తున్నామని చెబుతూ రవాణా సౌకర్యాలు మెరుగుపడినప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలు టూరిజం అబివృద్ధికి దోహదపడుతాయని తెలిపారు. తెలంగాణలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం కనిపించడం లేదని నితిన్ గడ్కరీ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ హయాంలో గ్రామీణ వ్యవస్థ కుప్పకూలిందని, గ్రామాల నుంచి యువత ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లారని ఆయన ఆయన గుర్తు చేశారు.  . రోడ్లు, తాగు నీరు సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. సర్కారు ఆస్పత్రులు అందుబాటులో లేక అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని పేర్కొన్నారు.

స్థానిక ఎంపి ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ .. జిల్లా రైతుల 35 ఏళ్ల పసుపు బోర్డు కలను మోదీ సర్కార్ నెరవేర్చిందని చెప్పారు. దేశంలో మూతపడిన అనేక చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించారని, అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ సైతం తెరిపించాలని కేంద్ర మంత్రిని కోరారు.

రేవంత్‌ రెడ్డి, కవిత ఇద్దరూ ఒక్కటే అని.. ఇద్దరూ కలిసి నిజామాబాద్‌ అభ్యర్థిని డిసైడ్‌ చేస్తారని ధ్వజమెత్తారు. రైతుబంధు నిధుల్లో కోమటిరెడ్డి రూ.2వేల కోట్లు, పొంగులేటి రూ.3వేల కోట్లు బిల్లుల కింద తీసుకున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని చెబుతూ  రాష్ట్రంలో 14 సీట్లకు పైనే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.