ప్రధాని మోదీ 4, 5 తేదీల్లో తెలంగాణాలో పర్యటన

ప్రధాని నరేంద్రమోదీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 4వ తేదీన ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్‌లో జరిగి బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఆ తర్వాత హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. 
 
ఇక 5వ తేదీన సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించటంతో పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ సభ తర్వాత తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఒడిశా బయలుదేరి వెళ్లనున్నారు.  గత ఎన్నికల్లో 4 ఎంపీలను గెలుచుకొని సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ ఈ సారి పదికిపైగా ఎంపీలను గెలవాలని గట్టిగా భావిస్తోంది. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించింది.

మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న సభలను విజయవంతం చేయాలని బిజెపి శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆదిలాబాద్, సంగారెడ్డిలో నిర్వహించే పార్టీ సభలకు భారీగా కార్యకర్తలను తరలించాలని చూస్తున్నాయి. ప్రధాని మోదీ టూర్ ద్వారా  పార్లమెంట్ ఎన్నికల నగారా మోగించాలని భావిస్తున్నాయి. 

ఇప్పటికే ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం త్వరలోనే మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.