హైదరాబాద్‌‌లో 2 భారీ ఎలివేటేడ్ కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారుతోంది. నగరంలో ఇప్పటికే వందకు తగ్గకుండా ఫ్లై ఓవర్లు, పదుల సంఖ్యలో అండర్ పాసులు నిర్మించగా.. ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గట్లేదు. తాజాగా.. అండర్ రోడ్డు టన్నెల్స్ నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే.. నగరం నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. 
 
నగరం నుంచి దగ్గర్లోని ప్రధాన పట్టణాలకు వెళ్లేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడితే.. అందులో నగరాన్ని దాటేందుకే గంటన్నరకు పైగా టైం పడుతుండటం గమనార్హం. అందులోనూ.. జేబీఎస్ నుంచి శామీర్ పేట రూట్‌, మేడ్చల్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. అయితే.. వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు ఆయా మార్గాల్లో భారీ ఎలివేటెడ్ కారిడార్లకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టగా.. ప్రస్తుతం వాటికి లైన్ క్లియర్ అయ్యింది.
 

హైదరాబాద్‌‌- కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్- నాగ్‌పూర్ జాతీయ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపించగా, కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే.. ఆ మార్గాల్లో డిఫెన్స్ భూములు ఉండటంతో.. వాటి మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని గత ప్రభుత్వంలో చాలా సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయగా.. చివరికి లైన్ క్లియర్ అయింది.

అయితే ఇటీవలే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా అనుమతులు ఇచ్చిన పీఎం నరేంద్ర మోదీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండం పట్టణాలను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్షన్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల భూమి అవసరమని ర‌క్షణ శాఖ మంత్రికి సీఎం విజ్ఙప్తి చేశారు.

నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్లకోయ స‌మీపంలోని ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామ‌ని, అందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భ‌విష్యత్తులో డ‌బుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని ర‌క్షణ శాఖ మంత్రికి సీఎం విజ్ఙప్తి చేశారు.

ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఈ రెండు కారిడార్ల ఏర్పాటుతో.. హైదరాబాద్ నుంచి శామీర్‌పేట, హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. హైదరాబాద్‌- కరీంనగర్ రూట్‌లో ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా జరగనుంది.

గత ప్రభుత్వంలో జెఎస్బి నుంచి శామీర్‌పేట వరకు 18.5 కిలోమీటర్ల పొడవు డబుల్‌ డెక్కర్‌ స్కైవే నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్‌ , పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలకు హైదరాబాద్‌కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని అప్పటి ప్రభుత్వం వివరించింది. డబుల్‌ డెక్కర్‌ స్కైవే మూడంచెల పద్ధతి ఉంటుందని వివరించగా.. పైభాగంలో మెట్రో రైలు, మధ్యలో ఫ్లై ఓవర్, కిందిభాగంలో రోడ్డు ఉంటుందని తెలిపారు. అయితే.. మరి రేవంత్ రెడ్డి సర్కార్.. అదే ప్రతిపాదనను అమలు చేస్తుందా లేదా.. కొత్త డిజైన్ అమల్లోకి తెస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.