హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపించగా, కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే.. ఆ మార్గాల్లో డిఫెన్స్ భూములు ఉండటంతో.. వాటి మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని గత ప్రభుత్వంలో చాలా సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయగా.. చివరికి లైన్ క్లియర్ అయింది.
అయితే ఇటీవలే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా అనుమతులు ఇచ్చిన పీఎం నరేంద్ర మోదీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
నాగ్పూర్ హైవే (ఎన్హెచ్-44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి సీఎం విజ్ఙప్తి చేశారు.
ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఈ రెండు కారిడార్ల ఏర్పాటుతో.. హైదరాబాద్ నుంచి శామీర్పేట, హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. హైదరాబాద్- కరీంనగర్ రూట్లో ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా జరగనుంది.
గత ప్రభుత్వంలో జెఎస్బి నుంచి శామీర్పేట వరకు 18.5 కిలోమీటర్ల పొడవు డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్ , పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు హైదరాబాద్కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని అప్పటి ప్రభుత్వం వివరించింది. డబుల్ డెక్కర్ స్కైవే మూడంచెల పద్ధతి ఉంటుందని వివరించగా.. పైభాగంలో మెట్రో రైలు, మధ్యలో ఫ్లై ఓవర్, కిందిభాగంలో రోడ్డు ఉంటుందని తెలిపారు. అయితే.. మరి రేవంత్ రెడ్డి సర్కార్.. అదే ప్రతిపాదనను అమలు చేస్తుందా లేదా.. కొత్త డిజైన్ అమల్లోకి తెస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్
రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ
ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఎస్ఐబీ చీఫ్ కోసం పిటిషన్