రష్యా సైన్యం మెరుపు దాడులతో ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకుపోయింది. ఖార్కీవ్, డొనెట్స్, ఖేర్సన్, లూహాన్స్, జపోరిజ్జియా రీజియన్లను స్వాధీనం చేసుకొన్నట్టు అనతి కాలంలోనే ప్రకటించుకొన్నది. అయితే సమర్థవంతమైన ప్రతిఘటనతో ఉక్రెయిన్ బలగాలు ఆయా రీజియన్లలోని పలు ప్రాంతాలను తిరిగి తమ చేతిలోకి తీసుకొన్నాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా బలగాలు మూడు రోజుల్లోనే స్వాధీనం చేసుకొంటాయని కొంత మంది అంచనా వేశారు. అయితే ఉక్రెయిన్ సైనికుల ప్రతిఘటనతో ఆ మూడు రోజులు పోయి నేటితో రెండు దేశాల మధ్య పోరు మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది. యుద్ధంలో మొదట పైచేయి సాధించిన రష్యా తర్వాత క్రమంగా పట్టు కోల్పోతూ వచ్చినట్టు కనిపిస్తున్నది.
ఈ క్రమంలో రష్యాకు చెందిన వేలాది మంది సైనికులు మరణించారు. దీంతో రష్యా ప్రత్యేక సైనిక నియామకాలు కూడా చేపట్టాల్సి వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడింది. ప్రపంచ వాణిజ్యం ప్రభావితమైంది. ప్రధానంగా ఆహార, ఇంధన మార్కెట్లు దెబ్బతిన్నాయి. రెండు దేశాల నుంచి సరఫరా నిలిచిపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి.
ఇంధన ధరలు విపరీతంగా పెరుగడంతో పాటు ఆహార కొరత ఏర్పడింది. మరోవైపు యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు రష్యాపై పలు రకాల ఆంక్షలు విధించాయి. దీనికి ప్రతిగా రష్యా కూడా పలు చర్యలు తీసుకొన్నది. దీంతో ప్రధానంగా రష్యా నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడే ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి రెండేండ్లు ముగియడం, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో మృతికి స్పందనగా అమెరికా శుక్రవారం 500కు పైగా రష్యా సంబంధిత వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది.
More Stories
టీ20 ప్రపంచకప్కు ఉగ్రముప్పు!
చివరి నిమిషంలో సునీత విలియమ్స్ స్పేస్ మిషన్ రద్దు!
రఫా నుంచి ఇజ్రాయిల్ లక్ష మంది తరలింపు