యూకే పార్లమెంట్లో ఇటీవల ‘సంకల్ప్ దివస్’ నిర్వహించారు. ఆ సందర్భంగా యానా మీర్ అక్కడ ప్రసంగించారు. ‘‘నేను మలాలా యూసుఫ్ జాయ్ ను కాదు.. కాబోను. ఎందుకంటే నేను నా మాతృ దేశం భారత లో భాగమైన మాతృ భూమి కాశ్మీర్ లో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను. మలాలా యూసఫ్ జాయ్ లాగా నేను నా మాతృభూమిని వదిలి పారిపోయి. మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం నాకు లేదు” అంటూ పరోక్షంగా పాకిస్థాన్ లో నెలకొన్న పరిస్థితులను ఉటంకిస్తూ ఎద్దేవా చేశారు.
“అభివృద్ధిలో దూసుకుపోతున్న నా దేశాన్ని అణచి వేస్తున్న దేశం అంటూ మలాలా యూసుఫ్ జాయ్ కించపరిచేలా మాట్లాడారు. భారతీయులను మత ప్రాతిపదికన పోలరైజ్ చేయడం మానుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి మేము మిమ్మల్ని అనుమతించము’’ అని యానా మీర్ తన ప్రసంగంలో ఒకింత హెచ్చరిక మాదిరిగా మాట్లాడారు. ఫిబ్రవరి 21న మీర్ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది.
యూకే పార్లమెంట్ లో యానా మీర్ దాదాపు మూడు నిమిషాలు ప్రసంగించారు. ఆమె ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘సోషల్ మీడియా, అంతర్జాతీయ మీడియా నుండి వచ్చిన టూల్కిట్ సభ్యులెవరూ కూడా కాశ్మీర్ను సందర్శించాలనుకోరు. కానీ అక్కడ అణచివేత జరుగుతోందని కథనాలను రూపొందిస్తుంటారు’’ అని ఆమె విమర్శించారు.
‘‘ఈ సంవత్సరం సంకల్ప్ దివస్ రోజున, యూకే, పాకిస్తాన్ లలో నివసిస్తున్న మా దేశ వ్యతిరేకులు అంతర్జాతీయ మీడియాలో లేదా అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలపై నా దేశాన్ని కించపరచడం మానేస్తారని నేను ఆశిస్తున్నాను. అవాంఛిత ఎంపిక చేసుకొనే ఆగ్రహాన్ని ఆపండి. మీ యుకె లివింగ్ రూమ్స్ నుండి భారతీయ సమాజంపై తీర్పు ఇవ్వడం మానేయండి” అంటూ ఆమె హితవు చెప్పారు.
“ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే వేలాది మంది కశ్మీరీ తల్లులు తమ కుమారులను కోల్పోయారు. మా వెంట పడడం మానేయండి. నా కశ్మీరీ సమాజంను ప్రశాంతంగా బతకనివ్వండి. థాంక్యూ అండ్ జై హింద్’ అని యానా మీర్ తన ప్రసంగాన్ని ముగించారు.
యానా మీర్ కాశ్మీర్ ఉద్యమకారిణి, జర్నలిస్ట్. ఆల్ జేకే యూత్ సొసైటీ (ఎజికెవైయెస్)కు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ విషయాలు ఆమె ట్విటర్ బయోలో ఉన్నాయి. అందులో ఆమె తనను తాను టెడ్ఎక్స్ స్పీకర్ గా అభివర్ణించుకున్నారు. తన యూట్యూబ్ చానెల్ లో తనను కశ్మీరీ రాజకీయ విశ్లేషకురాలిగా పేర్కొన్నారు. యూకేలో జరిగిన ఈ సంకల్ప్ దివస్ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ ప్రాంతంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించినందుకు గానూ యానా మీర్ `డైవర్సిటీ అంబాసిడర్’ అవార్డును అందుకున్నారు.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత