గోండు గిరిజనుల గోస కాంగ్రెస్ ప్రభుత్వంకు పట్టదా?

అధికారంలోకి రాగానే అడవి బిడ్డలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలందిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఊసె త్తకపోవడం శోచనీయమని మాజీ మంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ మండిపడ్డారు. 
 
బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప బస్సు యాత్ర గురువారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతాలలో కొనసాగింది. ఈ బస్సు యాత్రలో బిజెపి నేత ఈటెల రాజేందర్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ పార్లమెంటు సభ్యులు రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత గుడిహాత్నూర్ లో బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఇంద్రవెల్లిలో జరిగిన రోడ్ షోలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పట్టాల విషయంలో అడవి బిడ్డల గోసపుచ్చుకోవద్దని హితవు పలికారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొండ నాలుకకు మందు పెడతామని చెప్పి ఉన్న నాలుక ఊడబీకారని, పోడు పట్టాలిస్తామని నమ్మించి 13 కాలంలు తొలగించి ఆదివాసుల హక్కులు కాలరాశారని ధ్వజమెత్తారు. 

పోడు పట్టాల పేరిట గత పాలకులు కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేశారని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, నరేంద్ర మోదీ నాయకత్వ కాలంలో భారతదేశం నెంబర్ 1 గా నిలుస్తుందని  ఉట్నూర్ పట్టణ కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిర్వహించిన బిజెపి విజయసంకల్ప యాత్రలో  చెప్పారు.

తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలను విస్మరించారని ఆ హామీలను ప్రజలు కూడా మర్చిపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఇచ్చిన హామీల నిలబెట్టుకోవడంలో విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. 

కేంద్రంలో రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజనేతరులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు రైతుబంధు రావాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజ నేతలు సాగు చేసుకుంటున్న భూములకు పరిహారం చెల్లింపుల్లో ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.