మరాఠాలకు 10% రిజర్వేషన్లు

విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే మరాఠా కోటాపై బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించిన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 
 
రాష్ట్ర జనాభాలో మరాఠాలు 28 శాతం ఉన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందటం వల్ల మరాఠా వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్‌ లభించనున్నాయి. ఈ రిజర్వేషన్లను పదేళ్ల తర్వాత సమీక్షిస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని కులాలు, సమూహాలు రిజర్వ్‌డ్‌ క్యాటగిరీల్లో ఉన్నాయి. అన్నీ కలిపి 52 శాతం రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. 
 
52 శాతం రిజర్వేషన్లలో షెడ్యూల్డ్‌ కులాలు 13 శాతం, షెడ్యూల్డ్‌ తెగలు 7 శాతం, ఓబీసీలు 19 శాతం, ప్రత్యేక వెనుకబడిన తరగతులు 2 శాతం, విముక్త జాతి 3 శాతం, సంచార తెగ(బీ) 2.5 శాతం, సంచార తెగ(సీ) ధన్గర్‌ 3.5 శాతం, సంచార తెగ (డీ) వంజరి 2 శాతం రిజర్వేషన్లను కలిగి ఉన్నాయి.

మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సుమారు 2.5 కోట్ల కుటుంబాల సామాజిక స్థితిగతులపై ఇటీవల సర్వే జరిపి నివేదికను అందజేసింది. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడం సమంజసమేనని నివేదిక పేర్కొంది. రాష్ట్ర జనాభాలో మరాఠా కమ్యూనిటీకి చెందిన వారు 28 శాతం ఉన్నారని, 21.22 శాతం ఎల్లో రేషన్ కార్డులతో దాదాపు మరాఠా కుటుంబాలన్నీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయని తెలిపింది. 

ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో జరిపిన సర్వేలోనూ 84 శాతం మరాఠా కుటుంబాలు ప్రొగ్రసివ్ క్యాటగిరిలో లేవని తేలింది. ఇంద్ర సాహనీ కేసు కింద వీరంతా రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులని సర్వే స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం ఇతర కమ్యూనిటీలకు వర్తిస్తున్న రిజర్వేషన్ కోటాకు భంగం కలుగకుండానే మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. 

అయినప్పటికీ, మరాఠా కమ్యూనిటీని ఓబీసీ క్యాటగిరిలో చేర్చడంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గతంలోనే రెండు సార్లు అసెంబ్లీ ఇటువంటి తీర్మానాలు చేసినా ప్రయోజనం లేకపోవడం గమనార్హం. మరోవైపు, మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ల విషయంలో న్యాయ పోరాటాలు కూడా చోటుచేసుకున్నాయి. 

కాలేజీ అడ్మిషన్లు, ఉద్యగాల్లో మరాఠీ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడం చెల్లనేరదని 2021లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనివార్య పరిస్థితుల్లోనే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతాన్ని దాటి రిజర్వేషన్లు ఉండరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.