ఏడాదికి రెండు సార్లు ప‌రీక్ష‌లు

ఏడాదికి రెండు సార్లు ప‌రీక్ష‌లు
నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే  పదో తరగతి, ఇంటర్‌ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్‌ రైజింగ్‌ ఇండియా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ  2020లో తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం ఒకటని, ఈ క్రమంలో విద్యార్థులు రెండు సార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

గత ఏడాది ఆగస్టులో విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొత్త కరికులం ఫ్రేమ్‌వర్క్  ప్రకారం.. విద్యార్థులు మంచి పనితీరు కనబరిచేందుకు తగినంత సమయం ఇవ్వడానికి బోర్డు పరీక్షలు సంవత్సరానికి కనీసం రెండుసార్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఉంచడం, నాణ్యమైన విద్యతో వారిని సంపన్నం చేయడం, విద్యార్థులను సంస్కృతితో అనుసంధానం చేయడం, భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయడం జాతీయ విద్యా విధానం ఉద్దేశమని తెలిపారు.

ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ గతేడాది ఆగస్టులో కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని ప్రతిపాదించారు. 

ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ప్రిపేర్‌ అయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు మంచి పనితీరు కనబరిచేందుకు వీలుంటుందని విద్యాశాఖ పేర్కొంది. ఇక, కొత్త ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లను కచ్చితంగా అభ్యసించాలని, వాటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని మాత్రం నిర్ణయించారు.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ మాతృభాషలో చదుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్రం రాబోయే మూడేళ్లలో అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు అనువాదం చేయాలని ఎన్‌సీఈఆర్‌టీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఇగ్నో, జాతీయ సార్వత్రిక విద్యా పీఠంతోపాటు కేంద్రీయ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ వర్సిటీలను విద్యాశాఖ ఆదేశించింది. 

మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యా విధానం-2020 సిఫారసు చేసిన విషయం తెలిసిందే. బీటెక్ కోర్సులనూ ప్రాంతీయ భాషల్లో బోధనకు ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా అనుమతి ఇస్తుండగా, మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కోర్సు హిందీ మాధ్యమంలో ఇప్పటికే ప్రారంభమైంది.