మూడోసారి మోదీ పీఎం అయితే… ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీజేపీకి పట్టం కడితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వ‌న్ గా నిలుస్తుందని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ భరోసా వ్యక్తం చేశారు. మంగళవార బాసర లో ప్రారంభ‌మైన బీజేపీ విజయ సంకల్ప బస్సు యాత్ర భైంసాకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

మోడ్  అభివృద్ధి పరిచిన జాతీయ రహదారులపైనే ప్రియాంక, రాహుల్ గాంధీ పాదయాత్రలు చేపడుతున్నారని ఆరోపించారు. విజయ సంకల్ప యాత్ర 5500 కిలోమీటర్ల మేర సాగనుందని, ఈ యాత్ర జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. మూడోసారి ముచ్చటగా మోదీనే ప్రధానమంత్రిగా చేసి, దేశం అభివృద్ధి పథంలో సాగాలనే ఉద్దేశంతో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. 

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందని చెబుతూ 2018 సంవత్సరంలో 6.8 శాతం ఓట్లు సంపాదించగా, 2023 లో 14.9 అయిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వీళ్ల పాలన రజాకార్ల పాలనని, దీన్ని అంతం చేసే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టం చేశారు. భారత ప్రజలు కాంగ్రెస్ ని తరిమికొట్టి మోదీని తీసుకొచ్చారని తెలిపారు.

దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మోదీదేనని కొనియాడారు. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతుందని, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఊసే లేదని శర్మ ధ్వజమెత్తారు. అస్సాం రాష్ట్రంలో పెట్రోల్ 98 రూపాలు కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై టాక్స్ వేసి 110 రూపాలకు ఇస్తూ ప్రజలపై భారాన్ని మోపి రక్తాన్ని తాగుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం వచ్చి అన్ని ఉచితంగా ఇస్తామని హామలిచ్చారని గుర్తు చేస్తూ అయితే ఏ ఒక్క హామీ నెరవేర్చ‌లేద‌ని విమర్శించారు. గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తే మూడు రాష్ట్రాలు గాలిలో కలిసాయని, ఇప్పుడు భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నాడని, దానితో మొత్తం భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ గాలిలో కలుస్తుందని ఎద్దేవా చేశారు. 

భారత్ యాత్రతో ఒరిగిందేమీ లేదని అంటూ అస్సాం ప్రజలు రాహుల్ భారత్ జూడో యాత్రను తిరస్కరించారని చెప్పారు. నిర్మల్ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారని, ఎమ్మెల్యే తో పాటు ఫ్లోర్ లీడర్ అయ్యారని ఆయన గుర్తు చేశారు.  అలాగే తాను కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ లోకి వచ్చి అస్సాంకు ముఖ్యమంత్రిని అయ్యానని చెలిపారు. 

రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్, మణిపూర్ మంత్రి సుసేంద్ర మెహర్, అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పవర్ రామారావు పటేల్ తదితరులు కూడా పాల్గొన్నారు.