దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్న శుభసందర్భాన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలను పండుగలా నిర్వహించుకుంటున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ తెలిపారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ‘తిరంగా యాత్ర’లో యువత, ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై కుటుంబ సమేతంగా మువ్వన్నెల జాతీయ జెండాను గర్వంగా, ఉత్సాహంగా ఎగురవేయాలని, తిరంగా యాత్రలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్ల అమూల్యమైన త్యాగాల పునాదులపైనే నేటి సగర్వ భారత్ నిర్మాణం జరిగిందని రాంచందర్ రావు పేర్కొన్నారు.
మోదీ సమర్థ నాయకత్వంలో భారత్ సరికొత్త ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోందని తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 14న ట్యాంక్ బండ్ పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు నిర్వహించనున్న తిరంగా యాత్రను పవిత్రమైన దేశభక్తి కార్యక్రమంగా అభివర్ణించిన ఆయన, రాజకీయాలకు అతీతంగా ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

More Stories
రూ. 4 లక్షల కోట్ల అప్పులతో తెలంగాణాలో ఆర్థిక అత్యవసర పరిస్థితి
ఖార్ఖానాలో రాజీవ్ రహదారి బాధితుల ఆందోళనకు బిజెపి మద్దతు
తెలంగాణ ఎస్ఐఆర్ లో 73 లక్షల ఓట్ల గల్లంతు?