రీజనల్ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగంకు తొలగిన అడ్డంకులు

తెలంగాణలో రీజినల్‌ రింగ్‌రోడ్డు దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్​ఆర్​ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించింది. తాజాగా మంగళవారం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమైన అనంతరం దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని నితిన్‌గడ్కరీ ఎన్‌​హెచ్​ఐఏ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు రీజినల్‌ రింగ్‌ రోడ్‌ దక్షిణ భాగమైన చౌటుప్పల్‌- ఆమన్‌గల్‌- షాద్‌నగర్‌, సంగారెడ్డి పరిధిలోని 182 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఆర్​ఆర్​ఆర్​ అంశంతో పాటు రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్తరణకు అనుమ‌తి, ప‌లు ముఖ్యమైన రాష్ట్ర ర‌హ‌దారుల‌ను జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని కేంద్రమంత్రి నితిన్ గ‌డ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ ఆరు వ‌రుస‌లు, హైద‌రాబాద్‌-క‌ల్వకుర్తి నాలుగు వ‌రుస‌ల‌తో పాటు మరికొన్నింటికి అనుమ‌తి ఇవ్వాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ విజ్ఞప్తులకు కేంద్రమంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా, తొలుత రీజిన‌ల్ రింగు రోడ్డు దక్షిణ భాగంలో క‌రెంటు స్తంభాలు, భ‌వ‌నాలు సహా త‌దిత‌రాల తొల‌గింపున‌కు సంబంధించిన వ్యయం విష‌యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మ‌ధ్య నెల‌కొన్న ప్రతిష్టంభన‌పై చ‌ర్చసాగింది.

యుటిలిటిస్ త‌ర‌లింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భ‌రించాల‌ని 10 నెల‌ల క్రితం భార‌త జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ట్రం అనుమ‌తి తెల‌ుప‌క‌పోవ‌డంతో ఈ విష‌యంలో ప్రతిష్ఠంభన నెల‌కొంది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత‌లు స్వీక‌రించిన త‌ర్వాత యుటిలిటీస్ త‌ర‌లింపు వ్యయాన్ని భ‌రించేందుకు స‌మ్మతిస్తూ ఎన్​‌హెచ్​ఐఏకు లేఖ పంపారు.

ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి గ‌డ్కరీ వ‌ద్ద ప్రస్తావించ‌గా ఆయ‌న ఈ అంశంపై ఎన్​‌హెచ్​ఐఏ అధికారుల‌ను ఆరా తీశారు. యుటిలిటీస్ త‌ర‌లింపు వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వమే భ‌రించాల‌ని మెలిక పెట్టిందెవ‌రంటూ అధికారుల‌పై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతేగాక, ఒక‌వేళ రాష్ట్రప్రభుత్వం ఆ వ్యయాన్ని భ‌రిస్తే భ‌విష్యత్‌లో టోల్ ఆదాయంలో స‌గం రాష్ట్ర సర్కారుకి చెల్లించాల్సి ఉంటుంద‌ని చెప్పారు.
అందువల్ల యుటిలిటీస్ త‌ర‌లింపు వ్యయాన్ని తామే భ‌రిస్తామ‌ని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆర్​ఆర్​ఆర్​కు సంబంధించిన భూసేక‌ర‌ణ‌, విధానప‌ర‌మైన ప్రక్రియ‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్యమంత్రికి గడ్కరీ సూచించారు.  కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సీఆర్‌ఐఎఫ్ (కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్రం మంజూరు చేసిన కేబుల్ బ్రిడ్జిని మరో చోటుకు మార్చాలని నితిన్ గడ్కరీని సిఎం రేవంత్ కోరారు.