సుందేష్‌ఖాలీలో పరిస్థితి భయంకరం.. అంతా అరాచకం

ఘర్షణలతో చిన్నాభిన్నమైన సుందేష్‌ఖాలీ ప్రాంతంలో పరిస్థితి భయంకంరంగా ఉందని, అరాచకానికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచిందని సీనియర్ బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ధ్వజమెత్తారు. కోల్‌కతా హైకోర్టు నుంచి అనుమతి పొందిన తరువాత సుందేష్‌ఖాలీ ప్రాంతానికి మంగళవారం మధ్యాహ్నం ఆయన విచ్చేసారు. మరో బీజేపీ ఎంఎల్‌ఎ శంకర్ ఘోష్ ఆయన వెంట వచ్చారు.

ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. పరారీలో ఉన్న షాజహాన్ షేక్‌తోసహా స్థానిక టిఎంసి నాయకుల నుంచి తాము ఎలాంటి వెన్ను వణికే అనుభవాలను ఎదుర్కొన్నామో స్థానికులు వివరించారు. ఢమకాలీ నుంచి కాళింది నది బోటుపై దాటుకొంటూ సుందేష్ ఖాలీకి వచ్చిన బీజేపీ నేతలకు స్థానికులు మహిళలతో సహా బీజేపీ నేతలకు స్వాగతం పలికారు.

స్థానికుల భూములు లాక్కున్నారని, మహిళలపై అఘాయిత్యాలు సాగాయని, ఇవన్నీ కూడా పోలీస్‌లు, అధికారుల సహకారంతో జరిగాయని , పరిస్థితి భయంకరంగా తయారై , అరాచకం రాజ్యమేలుతోందని సువేందు అధికారి ఆరోపించారు.  మంగళవారం ఉదయం సువేందు అధికారిని పోలీస్‌లు అడ్డుకున్నారు. సుందేష్‌ఖాలీలో నిషేధాజ్ఞలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఆగ్రహం చెందిన అధికారి అక్కడే భైటాయింపు జరిపారు. కోర్టు అనుమతించిన తర్వాత కూడా అడ్డంకులు కల్పించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టును తిరిగి సంప్రదించి, అనుమతి పొందేవరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు.  అయితే కోర్టు అనుమతితో వారికి సుందేష్‌ఖాలీని సందర్శించడానికి వీలు కలిగింది. కాగా, సుందేష్‌ఖాలీలోబాధిత మహిళలను కలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో 24 పరాగణాల జిల్లాలో పర్యటించవచ్చని అధికారి వెల్లడించారు.