ఐఐఎం, ఐఐటీలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని

దేశవ్యాప్తంగా విద్య, రైల్వే, విమానయానం, రవాణా రంగాలలో రూ.32వేల కోట్ల వ్యయంతో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చేపట్టారు. అలాగే కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. జమ్మూ కశ్మీర్ లో మంగళవారం ఉదయం ప్రధాని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఏపీ విభజన హామీల్లో భాగంగా కేంద్ర విద్యాసంస్థల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుపతిలో ఐఐటీ, కర్నూలులో ఐఐటీ, హైదరాబాద్​లో ఐఐటీని వర్చువల్ గా ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు.

2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్‌ నిర్వహిస్తుండగా  ఆనందపురం మండలం గంభీరం వద్ద మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు. విశాఖకు మణిహారంగా నిలిచే ఐఐఎం శాశ్వత భవన నిర్మాణాలను రెండు దశల్లో చేపట్టారు. మొదటి విడతలో ఫ్యాకల్టీ బ్లాక్‌, పరిపాలన భవనంతోపాటు, విద్యార్థులకు వసతి గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తరగతి గదులు నిర్మించారు. క్యాంపస్‌ ప్రాంగణంలో 7,200 వృక్ష, ఫల, పూలజాతి మొక్కలను నాటనున్నారు. 15 వందల కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంటును అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తికానుంది.

తిరుపతి, చిత్తూరు క్యాంపస్​లు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాశ్వత భవానలను కూడా వర్చువల్‌గా ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో రెండు క్యాంపస్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ, ఐఐఎస్‌ఈఆర్‌ డైరెక్టర్‌ శంతాను భట్టాచార్య పాల్గొన్నారు. 

“ప్రధాన మంత్రి వర్చువల్ మోడ్‌లో కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అకడమిక్ కాంప్లెక్స్‌లో 52 ల్యాబ్‌లు, 104 ఫ్యాకల్టీ ఆఫీసులు, 27 లెక్చర్ హాల్స్ ఉన్నాయి. క్యాంపస్‌లో దాదాపు 1,450 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంది. 1,400 కంటే ఎక్కువ విద్యార్థులు ప్రస్తుతం వివిధ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్నారు.” అని ఐఐటి జమ్మూ డైరెక్టర్ తెలిపారు.

జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియం వద్దకు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ రూ.32,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. దేశ వ్యాప్తంగా 13 కేంద్రీయ విద్యాలయాల్లో, 20 కొత్త నవోదయ విద్యాలయాల్లో నిర్మించిన కొత్త భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. 

దేశవ్యాప్తంగా ఐదు కేంద్రీయ విద్యాలయ క్యాంపస్‌లు, ఒక నవోదయ విద్యాలయ క్యాంపస్, నవోదయ విద్యాలయాల కోసం ఐదు మల్టీపర్పస్ హాల్‌లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన ఈ కేవీలు, ఎన్వీ భవనాలు విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అని పీఎంవో స్పష్టం చేసింది.

భిలాయ్, తిరుపతిల్లో ఐఐటీలు, జమ్మూలో ట్రిపుల్ఐటీ, కర్నూలులో శాశ్వత క్యాంపస్‌లను జాతికి అంకితం ఇచ్చారు. రూ.13,375 కోట్లతో నిర్మించిన కాన్పూర్లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్- అధునాతన సాంకేతికతలపై మార్గదర్శక నైపుణ్య శిక్షణా సంస్థ,  ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్, త్రిపురలోని అగర్తలలో కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన ఈ రెండు క్యాంపస్‌లను ప్రధాని మోదీ అంకితం చేశారు.

వంశపారంపర్యం రాజకీయాల నుంచి కశ్మీర్​కు విముక్తి

మౌలానా ఆజాద్ స్టేడియంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ అనేక దశాబ్దాలుగా రాజవంశ రాజకీయాల బాధితురాలిగా ఉందని విమర్శించారు. వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న వారు తమ ప్రయోజనాల కోసం మాత్రమే చూసుకున్నారు తప్ప మీ ప్రయోజనాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వంశపారంపర్య రాజకీయాల వల్ల ఎక్కువగా నష్టపోయింది యువతేనని వెల్లడించారు. 

తమ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తులు మీ కుటుంబం గురించి చింతించరని చెప్పారు. ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ గోడతో పోల్చారు. ఆ గోడను బీజేపీ ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సమతుల్య అభివృద్ధి దిశగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈరోజు వందలాది మంది యువతకు ప్రభుత్వ నియామక పత్రాలు అందజేశామని మోదీ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌ ఈ వంశపారంపర్య రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందన్న సంతృప్తి ఉందని తెలిపారు.