బిజెపి-ఎన్‌డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు

తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి కొరవడిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బిజెపి- ఎన్‌డిఎ తప్ప వేరే ఏ రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదని ప్రధాని జోస్యం చెప్పారు. 

పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లాకు చెందిన కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తెహట్టాలో శుక్రవారం ఆయన ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్ 15 సీట్లకు మించి గెలవలేదు. కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అర్ధ సెంచరీ(50) మార్కును కూడా దాటడం సాధ్యం కాదని ప్రధాని తేల్చి చెప్పారు. 

ఇక వామపక్షాల పరిస్థితి అందరికి తెలిసిందే అని చెబుతూ పశ్చిమ బెంగాల్‌లో కూడా వామపక్షాల పరిస్థితి దయనీయం అని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బిజెపి-ఎన్‌డిఎకి మాత్రమే సాధ్యమవుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్నల్లా ఎన్‌డిఎ 400 మార్కును(సీట్లు) దాటుతుందా లేదా అన్నదే అని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో చేసిన లూటీకి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని టిఎంసి నాయకులను ప్రధాని  ఈ సందర్భంగా హెచ్చరించారు. 

పశ్చిమ బెంగాల్‌లో ప్రజల సొమ్మును తృణమూల్ కాంగ్రెస్ లూటీ చేస్తోందని, ఈ కారణంగానే తాను ప్రవేశపెట్టిన ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని ఆ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంతోనే అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజక్టులను రాష్ట్రంలో అమలు జరగనివ్వకుండా టిఎంసి ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. 

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖలీలో ఇటీవల సిబిఐ, ఎన్‌సిజి అధికారులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఆయుధాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణ కోసం వాటిని నిల్వ చేశారా? అని ఆయన టిఎంసిని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఈసారి రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో బిజెపి అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని మోదీ  తెలిపారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం బలంగా ఉంటే పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి మరింతగా జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.