100 రోజుల్లో ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనాలి

వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా 100 రోజుల్లో ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలు, కార్యకర్తలకు హితవు పలికారు. ఈ క్రమంలోనే వచ్చే 100 రోజుల్లో మన అందరం ప్రతీ కొత్త ఓటరును, ప్రతీ లబ్ధిదారుడిని, ప్రతి సంఘాన్ని చేరుకోవాలని సూచించారు. రాబోయే వంద రోజులు పార్టీ కార్యకర్తలు కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ధీమాతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
 
2024 ఎన్నికల సన్నగా ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సు ముగింపు సభలో ఆదివారం బీజేపీ నేత‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ విప‌క్ష నేత‌లు ఈసారి ఎన్డీయేకు 400 స్ధానాల‌ని నినాదాలు ఇస్తున్నార‌ని, ఎన్డీయేకు 400 స్ధానాలు వ‌చ్చే దిశ‌గా బీజేపీ 370 స్ధానాలు పైగా గెలుచుకోవాల‌ని పిలుపు ఇచ్చారు.

ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తలు సమాజం కోసం ఎంతో చేశారని, రేయింబవళ్లు కష్టపడ్డారని, భరత మాత ప్రతిష్ఠను ఇనుమడించేందుకే తమ శక్తిని వినియోగించారని ప్రశంసించారు. ”అధికారాన్ని అనుభవించేందుకు మూడోసారి గెలిపించమని నేను అడగడం లేదు. నా ఇంటి గురించి నేను ఆలోచించి ఉంటే కోట్లాది మంది ప్రజలకు ఇళ్లు నిర్మించగలిగే వాడిని కాదు. పేద ప్రజల భవిష్యత్తు కోసం జీవిస్తున్నాను. కోట్లాది మంది మహిళలు, పేదలు, యువత కష్టాలను పరిష్కరించాలన్నదే నా లక్ష్యం” అని మోదీ చెప్పారు.

తాము మెగా స్కామ్‌లు, ఉగ్ర దాడుల నుంచి దేశాన్ని ర‌క్షించామ‌ని యావ‌త్ దేశం విశ్వ‌సిస్తోంద‌ని ప్రధాని చెప్పారు. తాము పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగుప‌రిచేందుకు ప్ర‌య‌త్నించామ‌ని చెప్పారు. అభివృద్ధి చెందిన భార‌త్ ఆవిష్క‌ర‌ణ దిశ‌గా రాబోయే ఐదేండ్లు కీల‌క‌మ‌ని చెబుతూ  2047 నాటికి భార‌త్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మ‌లిచేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను గ‌త పదేండ్ల‌లో చేప‌ట్టామ‌ని ప్ర‌ధాని మోదీ వివ‌రించారు. 

మ‌నం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. గత పదేళ్లలో భారత్ సాధించిన విజయాల గురించి ప్రపంచమంతా ఈరోజు మాట్లాడుకుంటోందని, ప్రతి రంగంలోనూ భారత్ ఉన్నత శిఖరాలను చేరుకుందని పేర్కొన్నారు.  గత 10 ఏళ్లుగా దేశంలో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పాలన సాగించామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేలా చేయడం మామూలు విషయం కాదని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల కోసం కాకుండా.. దేశం కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు.

ఇవేమీ చిన్న చిన్న తీర్మానాలు కావని, అవి మన కలలని, భారతదేశాన్ని అబివృద్ధి పరచాలన్నదే ఆ కల అని ప్రధాని తెలిపారు. ఈ దిశగా రాబోయే ఐదేళ్లలో చాలా పెద్ద పాత్రను మనం పోషించబోతున్నామని స్పష్టం చేశారు.  గతం కంటే ఎన్నో రెట్లు వేగంగా దూసుకుపోయేలా మనం పనిచేయాల్సి ఉంటుందని మోదీ నిర్దేశం చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పనుల పరిష్కారానికి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లామని, 500 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో రామాలయం నిర్మించామని చెప్పారు.

కాగా, శనివారంనాడు ప్రారంభమైన సదస్సులో ‘వికసిత్ భారత్-మోదీ కీ గ్యారెంటీ’ అనే తీర్మానాన్ని ఆమోదించారు. తీర్మానం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాంస్కృతిక చర్యలు, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను వ్యక్తలు ప్రధానంగా ప్రస్తావించారు.