కాంగ్రెస్ అవినీతి పాలనలో అభివృద్ధికి నోచుకోలేని దేశం

కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనలో దేశం అభివృద్ధికి నోచుకోలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ దేశ భవిష్యత్తుపై ఆలోచనలేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు దేశం ఎంతో ధీమాగా ముందుకు దూసుకు వెళ్తోందని చెప్పారు. శుక్రవారం జరిగిన ‘వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ పాల్గొన్నారు.

”స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేడు స్వర్ణయుగం వచ్చింది. పదేళ్ల క్రితం నాటి నిరుత్సాహ పరిస్థితులను వెనక్కి నెట్టి ముందుకు వెళ్లే అవకాశం భారత్ కు  వచ్చింది. ఇప్పుడు భారత్ ఎంతో ధీమాగా ముందుకు వెళ్తోంది. 2014 సంవత్సరానికి ముందు కుంభకోణాలు, బాంబింగ్‌ల గురించే మాట్లాడుకునే వాళ్లు. ప్రజలు కూడా దీని గురించే వింతగా చర్చించుకుునే వారు. కాంగ్రెస్ హయాంలో అలాంటి వాతావరణం ఉండేది” అని మోదీ తెలిపారు.

కాంగ్రెస్‌కు ఒకటే ఎజెండా ఉందని, అది “యాంటీ-మోదీ, ఎక్స్‌ట్రీమ్ యాంటీ మోదీ” అని ప్రధాని ధ్వజమెత్తారు. మోదీపై వ్యతిరేక ప్రచారం ద్వారా సమాజాన్ని విడగొట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. ఆశ్రిత పక్షపాతం, అనువంశిక పాలన విషయ వలయంలో ఆ పార్టీ చిక్కుకుందని దుయ్యబట్టారు. ఈరోజు అంతా కాంగ్రెస్‌ను వీడిపోతున్నారని, అక్కడ ఒక్క కుటుంబమే కనిపిస్తోందని ప్రధాని ఎద్దేవా చేశారు. జనవరి 26న రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌కు ఘన స్వాగతం పలికిన రాజస్థాన్ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 

రాజస్థాన్ గత ప్రభుత్వ హయాంలో తరచు పేపర్ లీక్స్ జరిగేవనని, యువకులపై ఆ ప్రభావం పడేదని చెప్పారు. దీనిపై బీజేపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. పేపర్స్ లీక్స్‌కు పాల్పడేవారిపై కేంద్రం కఠిన చట్టం తెచ్చిందని చెప్పారు. కాగా, మోదీ ఈ కార్యక్రమంలో రూ.17,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ హ‌యాంలో రైతుల‌కు బ్యాంకుల మొండిచేయి

కాగా, క‌నీస మద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పీ)కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త స‌హా ప‌లు డిమాండ్ల‌పై రైతులు త‌మ ఆందోళ‌న‌ను ఉధృతం చేస్తుండ‌గా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రైతులకు లాభం చేకూర్చే ప‌ధ‌కాల‌పై క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని అంటూ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. హ‌రియాణ‌లోని రెవారిలో ఎయిమ్స్‌కు శంకుస్ధాప‌న చేసిన అనంత‌రం మోదీ బ‌హ‌రింగ స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
కేంద్రంలో అంత‌కుముందు ప‌దేండ్ల యూపీఏ హ‌యాంలో రైతుల‌కు చేసిందేమీ లేద‌ని మోదీ దుయ్య‌బ‌ట్టారు.గ‌తంలో రైతుల‌కు రుణాలిచ్చేవారు కాద‌ని, అలాంటిది కేంద్రం రైతుల‌కు బ్యాంకు రుణాలు అందేలా గ్యారంటీ క‌ల్పించింద‌ని తెలిపారు. రైతుల‌కు తాము మోదీ గ్యారంటీ క‌ల్పించామ‌ని, బ్యాంకులు అన్న‌దాత‌ల‌కు గ‌తంలో రుణాలిచ్చేవి కాద‌ని, కానీ తాము రైతుల‌కు గ్యారంటీ ఇచ్చామ‌ని మోదీ వివరించారు.