రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవెల్నీ జైలులో కన్నుమూత

ఎప్పటికప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్‌ను, ఆయన విధానాలను, తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేసే రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైలులో చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్ర అస్వస్థతకు గురైన నావల్నీ ప్రాణాలు కోల్పోయినట్లు జైలు అధికారులు వెల్లడించారు.  అయితే మరికొన్ని రోజుల్లో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ప్రతిపక్ష నేత, పుతిన్ ప్రత్యర్థి అయిన నావల్నీ జైలులో చనిపోవడం తీవ్ర సంచలనంగా మారింది.
ఆర్కిటిక్‌ ప్రిజన్ కాలనీలో అలెక్సీ నావల్నీ చనిపోయినట్లు రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్‌ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది.  రష్యాలోని ఆర్కిటిక్ జైలు కాలనీలో 19 ఏళ్లపాటు శిక్షను అనుభవిస్తున్న నవల్నీ శుక్రవారం మరణించినట్లు తెలిపింది.  జైలులో శిక్ష అనుభవిస్తున్న అలెక్సీ నావల్నీ.. చనిపోవడానికి కొద్దిసేపు ముందు వాకింగ్ చేశారని.. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఆయన అస్వస్థతకు గురైనట్లు జైలు వర్గాలు వెల్లడించాయి.
 
దీంతో ఆ వెంటనే నావల్నీ స్పృహ కోల్పోయినట్లు తెలిపాయి. దీంతో అత్యవసరంగా డాక్టర్లను రప్పించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదని, దీంతో ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని జైలు అధికారులు వెల్లడించారు. అయితే అలెక్సీ నావల్నీ మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
47 ఏళ్ల అలెక్సీ నవల్నీ రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ఎదురుతిరగడం, ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా ఒక్కసారిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు.  ఆయనను గత మూడేళ్లుగా రష్యా రాజధాని మాస్కోకు 150 మైళ్ల దూరంలో ఉన్న జైలులో ఉంచారు. 
 
అయితే కొన్ని నెలల క్రితం అలెక్సీ నావల్నీ జైలు నుంచి అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. నావల్నీ ఉన్న జైలు గదిలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారని.. ఆ తర్వాత నుంచి కనిపించడం లేదంటూ ఆయన తరఫు లాయర్లు వెల్లడించారు. ఆ తర్వాత వారం రోజులకే నావల్నీ ఆచూకీ దొరికినట్లు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

రష్యాలో అవినీతి వ్యతిరేక ఫౌండేషన్‌ స్థాపించిన అలెక్సీ నావల్నీ  గత అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు పోటీగా బరిలో నిలిచారు. పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించే నావల్నీ ఆ దేశంలో ప్రతిపక్షమైన రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ అధినేతగా ఉన్నారు. ఈ క్రమంలోనే రష్యాలోని ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టడంతోపాటు, గత ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 

 
కాగా, ఆగస్ట్ 2020లో సైబీరియాలో తనపై విషప్రయోగం జరిగినట్లు గతంలో నవల్నీ ఆరోపించారు.  నావల్నీ నరాల్లోకి పాయిజన్ ఇంజెక్షన్‌ను ఎక్కించడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కొన్ని నెలల పాటు జర్మనీలో చికిత్స తీసుకుని ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడి, 2021 జనవరిలో రష్యాకు చేరుకున్నారు.
 
ఎయిర్‌పోర్టులోనే నావల్నీని రష్యా పోలీసులు అరెస్టు చేశారు. నిధుల దుర్వినియోగం సహా పలు ఆరోపణలతో నావల్నీని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనను కోర్టులో హాజరుపర్చగా వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో 19 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇక నావల్నీ జీవితంపై కెనడా దర్శకుడు డేనియల్‌ రోహెర్‌ ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తెరకెక్కించగా.. గతేడాది ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌గా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం లభించింది.