మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్‌గా నిలిచిన బుమ్రా

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచిన తొలి బౌలర్‌గా బుమ్రా రికార్డ్ సృష్టించాడు. విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసిన బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. 
 
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ పొజిషన్‌కు చేరుకున్న తొలి భారత పేసర్‌గానూ బుమ్రా రికార్డ్ సృష్టించాడు.  ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటివరకు 34 టెస్టులు ఆడి పదిసార్లు ఐదు వికెట్ల హాల్ సాధించినప్పటికీ, ఇప్పటి దాకా బుమ్రా అత్యుత్తమ ర్యాంక్ 3 మాత్రమే.  
 
వైజాగ్ టెస్టులో సంచ‌ల‌న బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఈ యార్క‌ర్ కింగ్ 881రేటింగ్ పాయింట్స్ సాధించాడు. అలా మొద‌టిసారి ఫ‌స్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో అంచనాల మేర రాణించలేకపోయిన అశ్విన్ ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయాడు.  ఐసీసీ బుధ‌వారం ప్ర‌క‌టించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ కగిసో ర‌బడ‌ రెండో స్థానంలో నిల‌వ‌గా, నిరుడు మార్చి నుంచి నంబ‌ర్ 1గా కొన‌సాగ‌తున్న సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మూడో స్థానానికి ప‌డిపోయాడు. భార‌త ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా 9వ ర్యాంక్‌లో నిలిచాడు.
 
2024లో బుమ్రా రెండుసార్లు ఐదు వికెట్ల హాల్ సాధించాడు. కెప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన బుమ్రా. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 45 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్‌గా బుమ్రా నిలిచాడు.  ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న నాలుగో భారత ఆటగాడు బుమ్రా కావడం గమనార్హం. ఇంతకు ముందు అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ సింగ్ బేడీ ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నారు. బుమ్రా మినహా మిగతా ముగ్గురూ స్పిన్నర్లే. 
 
ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానానికి చేరుకున్న తొలి ఆసియా ఆటగాడిగా విరాట్ కోహ్లి గతంలో రికార్డ్ సృష్టించాడు.  హైదరాబాద్ టెస్టులో 80 పరుగులు చేయడంతోపాటు, విశాఖ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైశ్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 37 స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకున్నాడు. 
 
ఇటీవలి కాలంలో టెస్టుల్లో శతకాల మోత మోగిస్తోన్న కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఆడలేకపోయిన విరాట్ కోహ్లి ఒక ర్యాంక్ దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. ఏడాదికిపైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ 12వ స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 13వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ జాక్ క్రాలీ 8 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.