ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా

లోక్‌సభ 2024 ఎన్నికలకు ముందే ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు.  లవ్లీ తన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. తన రాజీనామాకు ఆప్ తో పొత్తును ప్రధాన కారణంగా తెలిపారు.
 
కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని అనేకమైన నిరాధార ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ కాంగ్రెస్ లోని నాయకులు స్పష్టం చేసిన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదని ఖర్గేకు వ్రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.  పైగా, ఆమ్ ఆద్మీ పార్టీలో సగం మంది కేబినెట్ మంత్రులు అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్నారని గుర్తు చేశారు. లవ్లీని ఆగస్టు 2023లో ఈ పదవికి నియమించారు.
 
ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయడానికి అనేక కారణాలున్నాయని పేర్కొంటూ ముఖ్యంగా ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపక్ బవారియా తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలు కారణమని స్పష్టం చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షునిగా తనను పనిచేయనీయడం లేదని, ఎటువంటి నీయమకాలు చేపట్టనీయడం లేదని విమర్శించారు. 
 
ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్‌ను, వాయువ్య ఢిల్లీ నుంచి ఉదిత్‌రాజ్‌కు కాంగ్రెస్‌ సీట్లు ఇవ్వాలని బవారియా తీసుకున్న నిర్ణయాల పట్ల  అరవిందర్ సింగ్ లవ్లీతో పాటు పార్టీలో పలువురు వ్యతిరేకిస్తున్నారు.  ఇటీవల దీపక్ బవారియా సమావేశంలో కన్హయ్య కుమార్‌కు టికెట్ ఇవ్వడాన్ని సందీప్ దీక్షిత్ వ్యతిరేకించారు. 
 
దీని తర్వాత ఉదిత్ రాజ్ విషయంలో మాజీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. తరువాత రాజ్‌కుమార్ చౌహాన్ రాజీనామా చేశారు. తమతో సంప్రదించకుండానే ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడాన్ని తప్పుబట్టారు.
పార్టీ ప్రయోజనాల కోసం అంగీకరించామని, అయితే ఢిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేనివారిని అభ్యర్థులుగా ప్రకటించారని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం మంచిదికాదని పేర్కొన్నారు.
 
ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేతలు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాలన్నింటినీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఢిల్లీ ఇన్‌ఛార్జ్) ఏకపక్షంగా కొట్టిపారవేస్తున్నారని లవ్లీ పేర్కొన్నారు. “నేను డీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఢిల్లీ ఇన్‌చార్జి) డీపీసీసీలో ఎటువంటి నియామకం చేయడానికి నాకు  అనుమతించలేదు. డీపీసీసీ మీడియా చీఫ్‌గా అనుభవజ్ఞుడైన నాయకుడిని నియమించాలని నా అభ్యర్థనను పట్టించుకోలేదు” అని నిరసన వ్యక్తం చేశారు. 
 
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఢిల్లీ ఇన్‌చార్జి) నగరంలోని అన్ని బ్లాక్‌ల అధ్యక్షులను నియమించడానికి డిపిసిసిని అనుమతించలేదు, దీని ఫలితంగా ప్రస్తుతం ఢిల్లీలోని 150 బ్లాకులకు పైగా బ్లాక్‌ల అధ్యక్షులు లేరని ఆయన వెల్లడించారు.