ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు

కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూటమి అధికారం లోకి వచ్చేలా ఓట్లు వేస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు వచ్చే వారి అలవాటు ఆచరణ లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ  ఎద్దేవా చేశారు. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో శనివారం ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమి కనీసం మూడంకెల సంఖ్య కూడా తెచ్చుకోలేదని, వారికి అవకాశం వస్తే ప్రతిఏటా ఒక ప్రధానిని నియమిస్తారని ధ్వజమెత్తారు.

“‘ఒక సంవత్సరం, ఒకే ప్రధాని’ ఫార్ములా అమలు గురించి వారు ఆలోచిస్తున్నారు, ఐదేళ్లు అధికారంలో ఉండటానికి అవకాశం లభిస్తే, ఐదుగురు ప్రధానులు ఉంటారు. కానీ ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులను మనపై రుద్దాలని కలలు కంటున్న వారిని దేశం సహించదు” అని ప్రధాని స్పష్టం చేశారు. 

కర్ణాటకలో రొటేషన్ పద్ధతిలో రెండున్నర ఏళ్లకు డిప్యూటీ సిఎంకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్లాను చేసిందని, ఈ ఏర్పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఉందని గుర్తు చేశారు. కర్ణాటకలో ఓబీసీల 27 శాతం కోటాలో ముస్లింలను చేర్చారని, ఈ మోడల్‌ను దేశమంతటా విస్తరింప చేయడానికి కాంగ్రెస్ ఆకాంక్షిస్తోందని ధ్వజమెత్తారు.

సామాజిక న్యాయాన్ని హత్య చేయడానికి కాంగ్రెస్ నాయకత్వ కూటమి కట్టుబడిందని , బుజ్జగింపు, ఓటుబ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ దిగజారిందని ప్రధాని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి, మత ప్రాతిపదిక రిజర్వేషన్ కోసం దళితులు, ఒబిసిల రిజర్వేషన్ కోటా ప్రయోజనాలను కాజేయడానికి చూస్తోందని విమర్శించారు. 

అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించడమే కాకుండా, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పంపిన ఆహ్వానాన్ని కూడా తిరస్కరించారని పేర్కొన్నారు. సంపద పంపిణీపై రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసి విమర్శలు గుప్పించారు. మీ సంపదను కాంగ్రెస్ యువరాజు వెతకడమే కాక, దేశం లోని వనరులపై ఎవరికైతే మొదటి హక్కు ఉందని ఆ పార్టీ చెబుతోందో వారికి ఆ సంపదను పంపిణీ చేస్తారని ఆరోపించారు. 

వారసత్వ ఆస్తులపై పన్ను విధించడానికి, ప్రజల ఆస్తులను కాజేయడానికి, కాంగ్రెస్ ఆలోచిస్తోందని, అలాంటి వారికి అధికారం లోకి రాడానికి అవకాశం ఇవ్వరాదని ప్రజలకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల రెండు దశల్లోనూ ఎన్‌డిఎ రెండు వంతులు ముందుందని చెప్పారు. 

కొల్హాపూర్‌కు ఫుట్‌బాల్‌ హబ్‌గా పేరుందని చెబుతూ రెండో దశ పోలింగ్‌ పూర్తవడంతో ఎన్‌డీఏ 2-0తో ముందంజలో ఉందని, భారత వ్యతిరేక విధానాలు, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కూటమి రెండు సెల్ఫ్ గోల్‌లు వేసుకుందని ప్రధాని  ఎద్దేవా చేశారు.  ఇండియా కూటమి తుడిచిపెట్టుకు పోయేలా మూడో దశలో ఓటర్లు ఆ లక్ష్యాన్ని సాధించగలరని తాను ఖచ్చితంగా చెప్పగలనని పేర్కొన్నారు.

 తర్వాత దశల్లో ఇండియా కూటమి తిరుగు లేని ఓటమి సాధిస్తుందని ఎద్దేవా చేశారు.  ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని, సీఏఏ రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోందని పేర్కొంటూ మోదీ నిర్ణయాలను ఎవరైనా మార్చగలరా ? అని ప్రశ్నించారు. ఒకవేళ అలా చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వారికి తెలుసని అంటూ హెచ్చరించారు.