ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. టైప్-2 డయాబెటీస్తో బాధపడుతున్న కేజ్రీ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్కు చెందిన మెడికల్ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. సుమారు అరంగంట సేపు సీఎంతో మాట్లాడిన ఎయిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని సూచించింది. మెడిసిన్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది.
వారం తర్వాత ఈ బృందం మరోసారి సీఎంను పరీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డు ఏర్పాటైంది. శనివారంనాడు కేజ్రీవాల్తో మెడికల్ బోర్డు జరిపిన వీడియో కాన్ఫరెన్స్లో తీహార్ జైలుకు చెందిన ఇద్దరు వైద్యులు కూడా హాజరైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కేజ్రీవాల్ ఒంట్లోని చక్కెర స్థాయి 320కి పెరగడంతో గతవారం తొలిసారి ఆయనకు జైలులో ఇన్సులిన్ డోస్ ఇచ్చారు. దీనికి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులతో రోజువారీ సంప్రదింపులకు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. అయితే, టైప్-2 డయాబెటిక్తో బాధపడుతున్న ఆప్ సుప్రీంకు ఇన్సులెన్ అవసరమా? కాదా? అనేది నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
కేజ్రీవాల్ ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించింది. అయితే వైద్యులు ఇచ్చిన డయిట్ ఛార్ట్కు అనుగుణంగానే అది ఉండాలని తేల్చిచెప్పింది. బ్లడ్ షుగర్ పెరగడం ద్వారా మెడికల్ గ్రౌండ్స్లో మెడికల్ బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు, ఆలూపూరీ, స్వీట్లు తీసుకుంటున్నట్టు ఈడీ ఆరోపించింది. అయితే, ఇన్సులన్, ఇతర డయాబెటిక్ మందులు ఇవ్వకుండా జైలులోనే ఢిల్లీ సీఎంను చంపే కుట్ర జరుగుతోందంటూ ఆప్ ఆరోపించింది.
More Stories
స్వామి చిన్మయానంద ఓ ఆధ్యాత్మిక విప్లవకారుడు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లైనా రావు
ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో ముందే హెచ్చరించిన బీజేపీ నేత అరెస్ట్