ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

 
* ఈలలు వేస్తూ, పేపర్లు విసురుతూ నినాదాలు
 
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ధరల పెంపు, పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుస్తున్నారని నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారామ్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. 
 
విజిల్స్ వేస్తూ, పేపర్లు చింపి విసురుతూ టీడీపీ ఎమ్మెల్యే గందరగోళం సృష్టించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, గద్దె రామ్మోహన్‌ , నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్‌, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయ స్వామిలను సస్పెండ్ చేశారు.

మంగళవారం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టిడిపి ఎమ్మెల్యేలు నిరసనలతో సభను హోరెత్తించారు. నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ వాయిదా తీర్మానానికి పట్టుబట్టగా, అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పేపర్లు చింపుతూ నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ టీ బ్రేక్ ఇచ్చారు. 

టీ బ్రేక్ తర్వాత సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు మళ్లీ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో మళ్లీ స్పీకర్ పోడియంపైకి వెళ్లిన టీడీపీ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. మరోవైపు, టిడిపి సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టిడిపి సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు.

పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టిడిపి సభ్యులు… బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులు సభలో మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈలలు వేసి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. 

సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. మార్షల్స్ వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఈలలు వేసుకుంటూనే బయటకు వెళ్లారు. టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ తో టీడీపీ సభ్యులు అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. స్పీకర్ తో టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన సరికాదని,  పేపర్లు చింపి, ఈలలు వేస్తూ స్పీకర్‌ను అవమానిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రు.