ఏపీలో 11.25 నుంచి 4.1 శాతానికి తగ్గిన పేదరికం

జగన్ ప్రభుత్వంలో పేదరికం 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టామని, పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏపీ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. 

ఈ ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని చెబుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మారిపోయాయని, విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశారని, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధనను అందిస్తున్నారని చెప్పారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశారని  పేర్కొంటూవచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం అమలు చేయడంతో పాటుగా.. ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తారని స్పష్టం చేశారు.

విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నారని చెబుతూ అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చని తెలిపారు. ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నారని చెప్పారు. అలాగే 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నారని, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు.

ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశారని, జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నారని, జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశారని, విద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనదని వివరించారు.

నాడు-నేడు ద్వారా ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తోందని పేర్కొంటూ  53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి, 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశారని గవర్నర్ తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడుతున్న విషయాన్ని ప్రసంగంలో ప్రస్తావించారు.

రైతులు రాష్ట్రానికి వెన్నెముక అంటూ10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చామని, రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారని, 22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారని, మిచౌంగ్ తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం అందిస్తున్నారని వివరించారు.