నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై చర్చ

రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘంకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బోధన్, ముత్యంపేటలలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. 

మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి? ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని చెప్పారు.

చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి,  రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏ. చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద నిజాం షుగర్స్ పరిశ్రమలో మూడు యూనిట్లు మూతపడ్డాయి. దీనిని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 1983లో మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ నిర్మించారు. 2002లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 51 శాతం వాటాలను డెక్కన్ పేపర్స్ లిమిటెట్‌కు విక్రయించింది. దీంతో ఎన్‌ఎస్డీఎల్(నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్)గా మార్చారు. 

2014లో బిఆర్‌ఎస్ (అప్పటి టిఆర్‌ఎస్) ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగుతున్న పరిశ్రమను సహకార సంఘంగా కొనసాగించాలని 2015లో గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్యాక్టరీ ఆర్థికంగా లాభదాయకంగా లేనందున ప్రభుత్వం దానిని నడపలేమని మాజీ సిఎం కెసిఆర్ గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. దీంతో 2017లో ప్రైవేట్ మేనేజ్‌మెంట్ లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఇది మూడు యూనిట్లను మూసివేయడానికి దారితీసింది.