రూ.7 లక్షల్లోపు ఆదాయంపై పన్ను లేదు!

* రూ. ల‌క్ష కోట్ల‌తో టెకీ యువ‌త కోసం కార్ప‌స్ ఫండ్‌
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం కలిగించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో వేతన జీవులు రూ.7 లక్షల్లోపు ఆదాయం గల వారు పన్ను మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. ఆదాయం పన్ను శ్లాబ్‌ల్లో ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.  
 
గత పదేండ్లలో పన్ను వసూళ్లు రెండింతలకు పైగా వసూళ్లయ్యాయని తెలిపారు. పన్ను వసూళ్లు రూ.20.02 లక్షల కోట్లకు చేరుకుంటాయని తెలిపారు. బడ్జెట్ అంచనాలకు మించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.30.03 లక్షల కోట్లకు చేరతాయని అంచనా వేశారు.  2024-25 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదనల్లో  దేశ యువ‌త కోసం కేంద్ర స‌ర్కార్ భారీ ప్ర‌క‌ట‌న చేసింది.
సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న యువ‌త‌కు ఇది స్వ‌ర్ణ‌యుగం కానున్న‌ది. టెకీ యువ‌త‌కు రుణాలు ఇచ్చేందుకు సుమారు ల‌క్ష కోట్ల‌తో కార్ప‌స్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.  50 ఏళ్ల పాటు వ‌డ్డీ లేకుండా ఆ రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. సుదీర్ఘ కాలం ఫైనాన్సింగ్‌, రీ ఫైనాన్సింగ్ లో భాగంగా ఈ స్కీమ్‌ను చేప‌ట్ట‌నున్నారు.
మూడు ఆర్ధిక కారిడార్ల‌కు చెందిన కీల‌క ప్ర‌క‌ట‌న  కూడా చేశారు. ఇంధ‌న‌, ఖ‌నిజ‌, సిమెంట్ రంగాల‌కు చెందిన ఓ కారిడార్‌ను రూపొందించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్‌ను కూడా డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.  మ‌ల్టీ మోడ‌ల్ క‌నెక్టివిటీ కోసం పీఎం గ‌తి శ‌క్తి స్కీమ్‌ను బ‌లోపేతం చేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు.
ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు కొత్త పధకాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు. కొత్త‌గా మూడు కోట్ల‌ మంది మ‌హిళ‌ల్ని ల‌క్షాధికారుల్ని చేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ టార్గెట్ అని ఆర్ధిక మంత్రి వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా అయిదు స‌మీకృత ఆక్వా పార్క్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌పంచంలోనే పాల ఉత్ప‌త్తిలో ఇండియా అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపారు.   బడ్జెట్‌ పరిమాణం మొత్తం రూ.47.66లక్షల కోట్లు కాగా, వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు.

బడ్జెట్‌ పరిమాణం మొత్తం రూ.47.66లక్షల కోట్లు

మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు
రైల్వేశాఖకు రూ.2.55లక్షల కోట్లు
హోంశాఖకు రూ.2.03లక్షల కోట్లు
వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77లక్షల కోట్లు
ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78లక్షలకోట్లు
ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13లక్షల కోట్లు
రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68లక్షలకోట్లు
కమ్యూనికేషన్‌ రంగానికి రూ.1.37లక్షలకోట్లు
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.86వేలకోట్లు
ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి రూ.7500కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200కోట్లు
సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903కోట్లు
సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8500కోట్లు
గ్రీన్‌ హైడ్రోజన్‌కు రూ.600కోట్లు

జీడీపీకి ప్రభుత్వం కొత్త అర్థం చెప్పిందన్న ఆర్థిక మంత్రి జీడీపీ అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌ పెర్ఫార్మెన్స్‌ అని కొత్త అర్థం ఇచ్చామని పేర్కొన్నారు. పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామని, పదేళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50శాతానికిపైగా పెరిగిందని ఆమె వెల్లడించారు. వాసవ్త ఆదాయ పెరుగుదల ప్రజల జీవన ప్రమాణాలు పెంచిందని చెబుతూ ఆశాలు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు