అయోధ్యకు 350 మంది ముస్లింల పాదయాత్ర

లక్నో నుంచి ఆరు రోజుల పాదయాత్ర పూర్తి చేసిన 350 మంది ముస్లిం భక్తులు అయోధ్య చేరుకుని రామ మందిరంలో ప్రార్థనలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న ముస్లిం సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్‌ఎం) సారథ్యంలో ఆ బృందం జనవరి 25న లక్నో నుంచి తమ యాత్ర ప్రారంభించినట్లు ఎంఆర్‌ఎం మీడియా ఇన్‌చార్జి షాహిద్ సయీద్ బుధవారం వెల్లడించారు. 

350 మంది ముస్లిం భక్తుల బృందం ‘జై శ్రీరామ్’ అని నినదిస్తూ సుమారు 150 కిలో మీటర్లు కాలినడకన, వణికించే చలిని తట్టుకుంటూ మంగళవారం అయోధ్య చేరుకున్నట్లు ఆయన తెలిపారు. వారు ప్రతి రోజూ 25 కిలో మీటర్లకు ఆగి ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయం తమ యాత్ర కొనసాగించినట్లు ఆయన తెలియజేశారు. 

ఆరు రోజుల పాటు నడచి బాగా అలసిపోయిన భక్తులు అయోధ్య చేరుకుని కొత్తగా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రామ్ లల్లా విగ్రహం వద్ద ప్రార్థనలు చేసినట్లు సయీద్ తెలిపారు. ‘భక్తులు ఈ గౌరవనీయమైన ఇమామ్ ఎ హింద్ రామ్ దర్శనాన్ని చిరకాలం గుర్తు ఉండే జ్ఞాపకంగా పరిగణించారు’ అని ఆయన తెలిపారు. ముస్లిం భక్తుల ఈ చర్య సమైక్యత, సమగ్రత, సర్వసత్తాక, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని సయీద్ పేర్కొన్నారు.