తొమ్మిదోసారి బిహార్‌ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం

బిహార్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠల నడుమ జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన మహాఘట్‌ బంధన్‌ నుండి నిష్క్రమించిన నితీశ్‌కుమార్‌ మళ్లీ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
 
 పట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాజేంద్ర ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. నితీశ్‌తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకరం చేశారు.  జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్ఛా నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

జేడీయూ నుంచి విజయ్‌ కుమార్‌ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్‌, శ్రవణ్ కుమార్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకరం చేశారు. ఉపముఖ్యమంత్రులుగా బీజేపీకి చెందిన సామ్రాట్‌ చౌదరి, విజయ్‌కుమార్‌ సిన్హా, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్చా నుంచి సంతోశ్‌కుమార్‌, సుమన్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా మారింది. ఆర్జేడీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌రో వైపు 78 మంది ఎమ్మెల్యేల‌తో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవ‌లం 45 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. 

ప్ర‌భుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. ఈ లెక్క‌న ఆర్జేడీకి ఇంకా 43 మంది స‌భ్యులు అవ‌స‌రం. జేడీయూ- బీజేపీ క‌లిస్తే వారి కూట‌మికి 123 మంది ఎమ్మెల్యేల బ‌లం ల‌భిస్తుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగ‌ర్ స‌రిపోతోంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు జేడీయూకు మద్దతు తెలపడంతో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.

నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం రాజీనామా అనంతరం బీహార్ లో రాజకీయ  పరిణామాలు శరవేగంగా మారిపోయాయి.  రాజీనామా చేయడానికి రాజ్‌భవన్‌కు బయలుదేరిన సమయంలో నితీష్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఫోన్ కాల్ అందినట్లు తెలుస్తోంది. మహాకూటమి నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నందు వల్ల ఆయనను అభినందించారు. ఎన్డీఏ కూటమిలో చేరాలంటూ లాంఛనంగా ఆహ్వానించారు.

ఉదయం జేడీయూ శాసనసభా పక్ష సమావేశం కొనసాగుతున్న సమయంలోనే అటు భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు.

జేడీయూతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపై ఏకవాక్యా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సామ్రాట్ చౌదరి. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా దీనికి తమ ఆమోదం తెలిపారు. బల్లలు చరిచి తమ అంగీకారాన్ని తెలియజేశారు. దీనితో బిహార్‌లో జేడీయూ- బీజేపీ- హిందుస్తాన్ ఆవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైంది.

ఈ తీర్మానానికి అనుగుణంగా రూపొందించిన లేఖపై బీజేపీ సభ్యులందరూ సంతకాలు చేశారు. నితీష్ కుమార్ సారథ్యంలో జేడీయూ- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ అంగీకారం తెలిపారు. ఈ లేఖను బీజేపీ ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్డే జేడీయూకు అందజేశారు.

దీనితో ఈ లేఖను తీసుకుని గవర్నర్‌ను కలిశారు. ఆయన వెంట వినోద్ తావ్డే, దినేష్ కుమార్ సింగ్, సామ్రాట్ చౌదరి, హిందుస్తానీ ఆవామీ లీగ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.