టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మ‌న్‌గా మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆమోదం తెలిపారు. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు ఐఏఎస్ అధికారి జ‌నార్ధ‌న్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌గా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. 
 
ఆయ‌న హ‌యాంలో టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాలు లీక్ కావ‌డంతో ప‌లు ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న దిశ‌గా అడుగులు వేసింది. చైర్మ‌న్‌తో పాటు స‌భ్యులంద‌రూ రాజీనామా చేశారు. తాజాగా కొత్త చైర్మ‌న్‌ను నియ‌మించింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. స‌భ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర‌, పాల్వాయి ర‌జ‌నీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాద‌య్య‌, వై రాంమోహ‌న్ రావు నియ‌మితుల‌య్యారు.
 
1962 డిసెంబర్‌ 3న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో నారాయణ రెడ్డి, అచ్చమ్మ దంపతులకు జన్మించిన మహేందర్‌రెడ్డి వరంగల్ ఎన్ఐటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐపీఎస్ కు ఎంపికయ్యారు. 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మ‌హేంద‌ర్ రెడ్డి ఐపీఎస్‌గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవ‌లందించారు. 
 
పోలీసు శాఖ‌లో సాంకేతిక‌త‌తో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చారు మ‌హేంద‌ర్ రెడ్డి. ఇంటెలీజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌‌ వంటి పలు కీలక పదవులలో పనిచేశారు.  12 నవంబర్ 2017 నుండి డిజిపిగా పనిచేస్తూ  2022, డిసెంబ‌ర్ 31వ తేదీన మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.
కొత్త ఛైర్మన్ కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా, ఛైర్మన్, సభ్యుల పదవి కోసం మెుత్తం 371 దరఖాస్తులు రాగా, అందులో 50 వరకు ఛైర్మన్ పదవి కోసం వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్లు ఉన్నారు.