ధరణి పేరు మారిస్తే సరిపోదు.. చట్ట సవరణలు చేయాలి

ధరణిపై ప్రభుత్వం నియమించిన కమిటీ కొన్ని కీలక సూచనలు చేసింది. సాఫ్ట్ వేర్ మార్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని.. ధరణి అంశంలో ఏకంగా చట్టాలే మార్చాల్సి ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది. సచివాలయంలో సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన కమిటీ సభ్యులు భూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సమావేశంలో పోర్టల్‌ను నిర్వహిస్తున్న టెర్రాసిస్‌ కంపెనీ ప్రతినిధులూ హాజరయ్యారు.
ఇప్పటివరకు అధికారులు, కంపెనీ ప్రతినిధుల నుంచి వచ్చిన సమాచారం క్రోడీకరించిన కమిటీ భూ సమస్యలకు పరిష్కారం కావాలంటే సాఫ్ట్‌వేర్‌తోపాటు రెవెన్యూ వ్యవస్థలో, చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని మాడ్యూల్స్‌ అవసరమని, దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అంతా ఆన్‌లైన్‌లో ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. బాధ్యతలన్నీ కలెక్టర్లకు అప్పగించడం వల్ల వస్తున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో కలుగుతున్న ఇబ్బందులు, చట్టపరంగా చేయాల్సిన మార్పులపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
ఇటు ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మార్చినంత మాత్రాన భూ సమస్యలు పరిష్కారం కావని, తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. పోర్టల్‌ను నిర్వహిస్తున్న విదేశీ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఐటీ సంస్థకు ప్రాజెక్టును అప్పగించాలని, లోపాలను సరిదిద్దాలని సూచించింది. సమస్యలను గత ప్రభుత్వమే గుర్తించిందని, కొత్తగా గుర్తించాల్సిందేమీ లేదని తేల్చిచెప్పింది.