మరోసారి పరిశుభ్ర నగరంగా ఇండోర్‌

 
* టాప్ 10లో  విశాఖ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్
దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్‌ వరుసగా ఏడోసారి టాప్‌ ప్లేస్‌ను దక్కించుకుంది. ఇండోర్‌తోపాటు సూరత్‌ కూడా సంయుక్తంగా తొలిస్థానంలో నిలిచింది. నవీ ముంబై మూడోస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇండోర్ నగరం నంబర్ 1గా నిలవడం ఇది ఏడోసారి కావడం విశేషం.  2023 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను  ఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
‘బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ స్టేట్స్‌’ క్యాటగిరీలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం (4), విజయవాడ (6), తిరుపతి (8) ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ 9వ స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని పుణే 10వ స్థానంలో ఉంది. భోపాల్ 5వ స్థానంలో నిలిచింది.

పారిశుధ్య కార్మికుల విషయంలో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న నగరంగా చంఢీగడ్ ప్రశంసలు అందుకుంది. గంగా నది తీరంలోని వారణాసి నగరం సైతం పరిశుభ్రత విషయంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి పాల్గొన్నారు.  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2016లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ఇస్తున్నారు.
2023 సంవత్సరానికి 4,416 పట్టణ స్థానిక సంస్థలు, 61 కంటోన్మెంట్లు, 88 నగరాలు ఈ అవార్డులకు పోటీ పడ్డాయి.  ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా 1.58 కోట్ల మంది ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించడం ద్వారా మరో 19.82 లక్షల మంది అభిప్రాయాలు తీసుకునన్నారు. వీటి ఆధారంగా ఈ అవార్డులకు అర్హత గత నగరాలను ఎంపిక చేశారు.