ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వేను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (మధ్యంతర బడ్జెట్)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు సమావేశ తేదీలను పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఎన్డీయే సర్కార్కు ఇదే చివరి బడ్జెట్ కానున్నది.
బడ్జెట్ పై చర్చకు రెండు రోజులు కేటాయించారు. చివరి రోజున బడ్జెట్ చర్చపై ప్రధాని ప్రసంగం ఉంటుంది. బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సారి సమావేశాల్లో పెదగా చట్ట సవరణలు ఉండకపోవచ్చు. అయితే, ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రస్తుతం ఇచ్చే డబ్బులను రెట్టింపు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
ఇటీవల జాతీయ మీడియాలో వెలువడిన కథనాల ప్రకారం భూ యజమానులైన మహిళా రైతులకు సంవత్సరానికి చెల్లిస్తున్న రూ.6 వేలను రూ.12 వేలకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.12 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మహిళా రైతులకు సాధికారత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పుకోవచ్చు.
More Stories
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు
టిఎంసి నాయకుడి ఇంట్లో ఆయుధాలు, బాంబులు