రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరింపులు

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.  రెడ్ బుక్ లో మీ పేర్లు రాశానని చెపుతూ పోలీసు విచారణ అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటషన్ లో పేర్కొంది.
 
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు.  ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌కు ఎన్‌బీడబ్ల్యూ  జారీచేయాలని, ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీస్ నిబంధనలను లోకేశ్‌ ఉల్లంఘించారని ఆరోపించింది
 
దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? అని సీఐడీ లాయర్ ను కోర్టు ప్రశ్నించింది.  దీంతో, పేపర్ కటింగ్ లను కోర్టుకు ఆయన చూపించారు. యువగళం‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీఐడీ ఆరోపించింది. కేసు దర్యాప్తుని ప్రభావితం చేసేలా వివాదాద్పద వ్యాఖ్యలు చేశారని,  చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని లోకేష్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ మెమోలో ప్రస్తావించారు.
 
స్కిల్, అమరావతి ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్ కేసులలో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని.. తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్‌పీసీ క్రింద వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. ఆ వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమని సిఐడి పేర్కొన్నది.

ఐఆర్ఆర్ కేసులో 41ఏ కింద లోకేశ్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని, అయితే, కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతిని ఇవ్వాలని కోరారు. రెడ్ బుక్ పేరుతో అధికారులను జైలుకు పంపుతానని లోకేశ్ బెదిరిస్తున్నాడని, ఇది చాలా అభ్యంతరకరం, కేసు పురోగతికి ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నారు.  
 
‘రెడ్ బుక్’ వాంగ్మూలాలను సీరియస్‌గా తీసుకోవాలని కోర్టును సిఐడి అభ్యర్ధించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌పై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసులో లోకేశ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోకేశ్‌కు ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.