రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును గెలిపించండి… రెండేళ్లల్లో పోలవరం  పూర్తి చేసి తీరుతామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ధర్మవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొంటూ  బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్  ఏర్పాటు చేస్తాం. పోలవరం పూర్తి చేస్తాయ ని ధీమా వ్యక్తం చేశారు. ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు.
 
అమరావతిని రాజధానిగా పునర్నిర్మించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలని కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం  ప్రాజెక్టును పూర్తి చేసే పూర్తి బాధ్యత ఎన్డీఏ కూటమిదని స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాలు ప్రజలకు తాగు, సాగు నీరు ఇవ్వాలని చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరానికి జాతీయహోదా ఇవ్వడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని అమిత్ షా గుర్తు చేశారు
 
రాష్ట్రంలో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని అమిత్‌షా తెలిపారు. అవినీతి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఆంధ్రాలో భూ మాఫియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రను కాపాడతామని, తెలుగు భాషను రక్షిస్తామని పేర్కొన్నారు. జగన్‌ రెడ్డీ గుర్తుంచుకో బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను అంతం కానివ్వమని స్పష్టం చేశారు.
 
“టిడిపి, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు ఇచ్చి, భారీ మెజారిటీతో గెలిపించండి. రాష్ట్ర అభివృద్ధి సంగతి కూటమికి వదిలేయండి. జగన్ తన అవినీతితో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. మూడోసారి మళ్లీ ప్రధాని అయ్యేది మోదీ” అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించేందుకు, ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టేందుకు ఆయన్ను మళ్లీ ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. 
 
ఉమ్మడి రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిపారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. విభజన తర్వాత కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్లారని, ఆయన చేసిన అభివృద్ధిని జగన్‌ అధోగతి పట్టించారని, మద్య నిషేధం చేస్తానని ఇచ్చిన మాట తప్పారని, మద్య నిషేధం చేయకపోగా, సిండికేట్‌కు తెరలేపారని నిప్పులు చెరిగారు.
 
 ఆరోగ్యశ్రీకి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారని, చంద్రబాబు, మోదీని గెలిపిస్తే రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లతో చంద్రబాబును సీఎంను చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుందని అమిత్‌షా ఆరోపించారు. రెండోసారి ప్రధానిగా మోదీ వచ్చాకే రామమందిర ప్రతిష్ఠ జరిగిందని గుర్తు చేశారు. రాహుల్‌, జగన్‌కు ఇద్దరికీ రామమందిర ప్రతిష్ఠకు ఆహ్వానించామని, రామమందిర పునఃప్రతిష్ఠకు రాని రాహుల్‌, జగన్‌కు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. 

చట్టసభలో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్లు తెచ్చామని, 80 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ‘ఇండియా’ కూటమిపై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, స్టాలిన్‌, రాహుల్‌ గాంధీ వీరిలో ఎవరిని చేస్తారో చెప్పాలని కోరారు. ఆ కూటమిలో ప్రధాని అభ్యర్థే లేరని ఎద్దేవా చేశారు.