కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో రేవంత్, హ‌రీష్ వాగ్వివాదం

తెలంగాణ అసెంబ్లీలో  ఆర్థిక శ్వేత‌ప‌త్రం ప్ర‌భుత్వం విడువ‌ల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బిఆర్ఎస్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి హరీష్ రావుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇద్ద‌రి మ‌ధ్య కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణ వ్య‌యంపై మాట‌లు యుద్దం సాగింది.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హరీష్ రావు మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి, రెండో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. గత పదేళ్లలో నీటిపారుదల శాఖను కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ చూడలేదని విమర్శించారు. 

 కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.97,449 ఋణం మంజూరు అయితే విడుదల అయింది రూ.79, 287కోట్లు. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు కాకుండా ఇంకా నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 80వేల కోట్లు కాదని చెబుతూ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు నిధులు వేరే వచ్చాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను అమ్మేందుకు గత ప్రభుత్వం ప్లాన్ చేసిందని ధ్వజమెత్తారు. 

కాళేశ్వరం నీళ్ళు అమ్ముతామని రూ.5,100 కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. 2014కు ముందు తెలంగాణ ప్రజలు మంచినీళ్ళు, ఇళ్లలో నల్లా కనెక్షన్లు ఉన్నట్లు గత ప్రభుత్వం చెప్తోందని, మిషన్ భగీరథపై రూ.5వేల కోట్ల ఆదాయం వస్తుందని బ్యాంకులను మభ్యపెట్టి రుణాలు తెచ్చారని వెల్లడించారు.  నీళ్ళపై వ్యాపారం చేసి కాళేశ్వరంపై రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథపై రూ.5వేల కోట్లు అప్పులు తెచ్చారని, టిఎస్ఐఐసికి వచ్చిన రుణాలకు   ప్రభుత్వమే బాధ్యత అని గ్యారెంటీ ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు.

అప్పుల కోసం ఆదాయం తప్పుగా చుపించిందంటూ కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. తన పద్ధతి మార్చుకోవాలంటూ కాగ్‌ గత ప్రభుత్వానికి హెచ్చరించిందని చెబుతూ శాసన సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు మాట్లాడితే చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ఆరోపణలను హరీష్ రావు కొట్టిపారవేస్తూ “సభను నేను తప్పుదోవ పట్టించలేదు. సీఎం రేవంత్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అంతా అర్థం కలవాలంటే కొంత సమయం పడుతుంది. కాళేశ్వరంపై తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మాత్రమే తీసుకోలేదు. పాలమూరు రంగారెడ్డితో పలు ప్రాజెక్టులకు ఉపయోగించారు” అని తెలిపారు. 

రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావని చెబుతూ  ప్రజల నిర్ణయం అనేది ఫైనల్ అని చెప్పారు. “మీ తెలివి తేటలతో నిధులు తీసుకురండి. గత ప్రభుత్వాన్ని బాద్నాం చేయకండి. మాపై నెపం నెట్టి తప్పించుకోకండి. మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి” అని హితవు చెప్పారు. రుణాలు చూపుతూ, అభివృద్ధి లెక్క‌లు చూప‌క‌పోవ‌డంతోనే మీ వివ‌క్ష తేల‌తెల్ల‌మ‌వుతుంద‌ని ధ్వజమెత్తారు.