తెలంగాణాలో రాజకీయ దుమారం రేపుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకమైన మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనలో వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై పలువురు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేయగా, సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఓ పిటిషన్ వేశారు.
ఆయన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం జరిగిన విచారణలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. మహాదేవపురం పోలీసు స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో కోరారు. పిల్లర్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నుంచి సమాచారం తీసుకుని వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.
మరోవంక, ఈ ఘటనపై సిట్టింగ్ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర శాసన మండలిలో ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటన బాధ్యులను ఎవరినీ వదిలిపెట్టబోమని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి హెచ్చరించారు. అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకం పనులు ఎలా చేశారని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు సంబంధం లేదంటూ ఏదో ఒక లేఖ అధికారులకు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల కాంట్రాక్టర్లను కూడా పిలిచి చర్చించాలని ఆదేశించారు.
More Stories
కొండా సురేఖకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక
తెలంగాణాలో రాగల ఐదు రోజులు వడగాలులు
తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి