ఉత్తరకాశీలో కూలిన టన్నెల్​.. లోపల చిక్కుకున్న 36 మంది!

ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో నిర్మాణం దశలో ఉన్న ఓ టెన్నెల్​ అనూహ్యంగా కూలిపోయి టెన్నెల్​ లోపల దాదాపు 36 మంది కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఛార్​ ధామ్​ రోడ్డు ప్రాజెక్ట్​లో భాగంగా గత కొంతకాలంగా ఈ టన్నెల్​ను నిర్మిస్తున్నారు.  ఉత్తరకాశీలోని సిల్​యారా- దండోల్గావ్​ను ఈ టన్నెల్ ​ కనెక్ట్​ చేస్తుంది.
ఈ మొత్తం ప్రాజెక్ట్​ అందుబాటులోకి వస్తే ఉత్తరకాశి నుంచి యమునోత్రి దూరం 26 కి.మీలు తగ్గుతుంది. కాగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సిల్క్​యారాలో నిర్మాణం దశలో ఉన్న టన్నెల్​ కూలింది.  ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీశారు అధికారులు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
“సిల్క్​యారా టన్నెల్​ స్టార్టింగ్​ పాయింట్​కు 200 మీటర్ల దూరంలో ఘటన చోటుచేసుకుంది. హెచ్​ఐడీసీఎల్​ ఈ టన్నెల్​ని నిర్మిస్తోంది. సంస్థ ప్రకారం లోపల దాదాపు 36మంది చిక్కుకున్నారు” అని  ఉత్తరకాశి ఎస్​పీ యాదువన్షి తెలిపారు. పోలీసులు, ఎన్​డీఆర్​ఎఫ్​- ఎస్​డీఆర్​ఎఫ్​  బృందాలు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాయని, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ఆయన చెప్పారు.

తాజా ఘటనపై ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​ సింగ్​ ధామి స్పందిస్తూ  “టన్నెల్​ కూలిన ఘటన విషయం నాకు తెలిసింది. అధికారులతో మాట్లాడాను. లోపల చిక్కుకున్న వారిని, సురక్షితంగా బయటకు తీసుకొస్తామని అధికారులు చెప్పారు,” అని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు చేపట్టాయని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని చెప్పారు.