దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు ఐఎస్‌ఐఎస్ కుట్ర… ఎన్‌ఐఏ చార్జిషీట్

దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసినందుకు ఏడుగురు అనుమానిత ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు తమ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే ఐసిస్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిధులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని చార్జిషీట్ పేర్కొంది. 

దేశంలో హింస, ఉగ్రవాదాన్ని పెంపొందించాలనుకుంటున్నారని ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. నిందితులం దరూ విద్యావంతులు, మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు. వీరు మహారాష్ట్రలోని పూణేలో అనేక సమావేశాలు నిర్వహించి, వాట్సాప్ గ్రూపు ల ద్వారా మరింత మంది సభ్యులను రిక్రూట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు ఛార్జిషీట్‌లో వెల్లడి చేసింది.

ఐఈడి కోసం రసాయనాలను కొనుగోలు చేయడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ కోసం వెనిగర్ లేదా సిర్కా, అసిటోన్ కోసం రోజ్ వాటర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కోసం షెర్బాట్ అనే కోడ్ పదాలను వినియోగించారు. ‘భారతదేశంలో ఐఎస్‌ఐఎస్ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి కట్టుబడి ఉన్న వీరంతా సంక్లిష్ట నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారని దర్యాప్తులో తేలింది‘ అని అధికారులు వెల్లడించారు. 

భారత్‌లో ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారి వ్యూహాన్ని వివరించే ‘రివెజ్ ఆన్ కాఫిర్స్‘ అనే హెడ్డింగ్‌తో కూడిన డాక్యుమెంట్స్‌ని కూడా దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. ‘కాఫీర్లు (ముస్లింయేతరులు) ముస్లింలపై ఆరోపించిన అకృత్యాలపై ప్రతీకారం తీర్చుకోవాలన్నారని అధికారులు తెలిపారు. 

నిందితులు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళతో సహా వివిధ రాష్ట్రాలకు వెళ్లి పేలుళ్లకు అనువైన లక్ష్యాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు తమ ప్లాన్‌ల పురోగతి గురించి అప్‌డేట్ చేసిన విదేశీ హ్యాండ్లర్‌లతో టచ్‌లో ఉన్నారని ఎన్‌ఐఏ ఆరోపించింది.