నేటితో ఓటరు నమోదుకు చివరి అవకాశం

పోలింగ్ రోజు ఓటు వేసేందుకు వెళ్లి.. ఓటు లేదని గగ్గోలు పెట్టడం, అధికారులపై ఫిర్యాదు చేయడం చూస్తుంటాం. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే ఓటరు జాబితాను పరిశీలించుకోవడం మంచిదని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబరు 30న నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రేపటితో ఆ అవకాశం ముగిస్తుండడంతో ఎన్నికల అధికారులు మరోసారి ఓటర్లుకు గుర్తుచేస్తున్నారు. సాధారణంగా తుది ఓటరు జాబితా ప్రకటించిన తరువాత ఓటర్లు పేర్లు పరిశీలించుకోవడం అవసరం.

 అయితే.. తీరిక లేని ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది పరిశీలించుకోవడం లేదు. కొన్ని చోట్ల వెళ్లినా ఓటరు జాబితా అందుబాటులో ఉండటం లేదు. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే పరిశీలించుకోవడం మంచిది. ఒక వేళ లేకపోతే నమోదుకు అక్టోబరు 31 వరకు అవకాశం ఉన్నందున ఓటర్లు వెంటనే జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని అధికారులు చెబుతున్నారు. 

జాబితా కోసం ఎక్కడికో వెళ్లే పని లేకుండా చేతిలో ఉన్న చరవాణి ద్వారా పరిశీలించుకోవచ్చు. గూగుల్‌లో electoralsearch.eci.gov.in వెబ్ పేజీ ప్రారంభించి, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఎంపిక చేసుకొని మీ పేరు లేదా మొబైల్ నంబర్ లేదా ఓటరు ఎపిక్ నంబర్ నమోదు చేస్తే మీ పేరు ఉందో ‘లేదో ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకు ఐదు నిమిషాల సమయం కేటాయిస్తే, సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.

కాగా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే వారు నవంబరు 7వ తేదీలోగా ఫారం- 12 (డి) దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని ఎన్నికల సంఘం కోరింది. 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు, కొవిడ్ పాజిటివ్ ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది.