శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇక రోబోల సేవలు

భారత దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయంలో ఒకటైన శంషాబాద్ విమానాశ్రయంలో ఇకపై రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయంలోకి అడుగు పెట్టినప్పటి నుండి విమానం ఎక్కెంత వరకు ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల సేవలను రోబోలే అందించనున్నాయి.

ప్రయాణికులకు రోబో సేవలు అందించడంతో పాటు పరిశుభ్రతను మరింత మెరుగు పరిచేందుకు విమానాశ్రయంలో రోబోటిక్ యంత్రాలు,పరికరాలు అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది జూన్ లోపు రోబో సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ఇందులో భాగంగా 6 నెలల క్రితం జిఎమ్ఆర్ గ్రూప్ “ ఇన్నోవెక్స్ ” పేరుతో విమానాశ్రయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం రోబోటిక్ సేవలకు సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఇన్నోవెక్స్ కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇందుకోసం ఇన్నోవెక్స్ ఇప్పటికే ఐఐటీ బాంబే తో ఎంఓయు చేసుకుంది. ఇక అదే సమయంలో రోబోటిక్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలను కూడా జిఏమ్అర్ సంస్థ ప్రోత్సహిస్తుందని తెలిపింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జూన్ నెలలో శంషాబాద్ విమానాశ్రయంలో రోబో సేవలు రానున్నాయని సిబ్బంది తెలిపారు. 

ఈ సర్వీస్ కోసం ఇప్పటికే రోబోటిక్ లాబొరేటరీని అందుబాటులోకి తెచ్చిన సంస్థ స్టార్టప్ కంపెనీలు తయారు చేస్తున్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ వాటికి మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ప్యాసింజర్ సేవలతో పాటు పర్యావరణాన్ని శుబ్రపరిచే విషయంలోనూ రోబోటిక్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని జిఎమ్అర్ సంస్థ భావిస్తుంది.

ఇందుకోసం విమానాశ్రయం చుట్టూరా ఉన్న కాలుష్యాన్ని సున్నా శాతానికి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రోబో సేవలు అందించడంతో ప్రయాణికుల సమయం ఆదా అవ్వడంతో పాటు ప్రయాణికుల పని మరింత సులభం అవుతుంది అంటున్నారు అధికారాలు.

కాగా ఇప్పటికే డిల్లీ, బెంగళూర్, అంతర్జాతీయ విమానాశ్రయలలో కృత్రిమమేథతో పని చేసే రోబోలు వాడుకులో ఉన్నాయి. అయితే ఆ రోబోలు ప్రయాణికులకు విమాన రాకపోకల సమయాలను తెలియజేస్తున్నాయి. అయితే ఢిల్లీ, బెంగళూరులలో లాగా కేవలం కొన్ని పనులు చేసే రోబోల మాదిరిగా కాకుండా అన్నీ రకాల సేవలు అందించే రోబోటిక్ యంత్రాలను,పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ అడుగులు ముందుకు వేస్తుంది.