భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి బీజేపీకి మద్దతిచ్చే విషయంలో పవన్ కల్యాణ్తో హైదరాబాద్లో ప్రాథమికంగా చర్చించామని, పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడాలని పవన్ కల్యాణ్ కోరడంతోనే ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలిపారు. జనసేన ఒక్కటే ఎన్డీయే భాగస్వామిగా ఉందని అంతవరకే చర్చలు పరిమితం అవుతాయని స్పష్టం చేవారు.
ఆంధ్ర ప్రదేశ్లో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల్లో కలిసే విషయంలో ఇరుపార్టీల మధ్య ఇప్పటికే ప్రాథమిక అవగాహన కుదిరినా ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయాలనే విషయంలో స్పష్టత రాలేదు.
కిషన్ రెడ్డి, లక్ష్మణ్లతో కలిసి అమిత్ షాతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. 27వ తేదీన సూర్యాపేటలో బహిరంగ సభ తర్వాత అమిత్షా హైదరాబాద్లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. హైదరాబాద్ వచ్చేలోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్షా సూచించినట్లు తెలుస్తోంది. పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు అమిత్షాకు తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 32 సీట్లు కోరుతోంది. కనీసం 20 సీట్లకు పట్టుబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఐదారు సీట్లకు మించి వదిలేందుకు బిజెపి సుముఖంగా లేదని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణాలో 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నవంబరు 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించిన తర్వాత రెండో జాబితాను విడుదల చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.
More Stories
వడ్డీ రేట్లను భారీగా పెంచిన స్టేట్ బ్యాంకు
హైదరాబాద్ జూలో మగ తెల్లపులి మృత్యువాత
చాబహార్ పోర్టుపై చిన్న చూపు తగదు .. అమెరికాకు హితవు