తెలంగాణాలో మాత్రమే బీజేపీ – జనసేన పొత్తు!

ఎన్డీయేలో బిజెపి భాగస్వామిగా ఉంటున్న జనసేనతో తెలంగాణాలో మాత్రమే ఎన్నికల పొత్తు గురించి ప్రస్తుతం బీజేపీ సుముఖంగా ఉందని, టిడిపితో పొత్తు పెట్టుకున్న జనసేనతో ఏపీలో పొత్తు విషయమై సుముఖంగా లేదని బుధవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ పాల్గొన్న ఈ భేటీలో తెలంగాణ ఎన్నికల గురించి మాత్రమే చర్చించినట్లు చెబుతున్నారు. బిజెపితో సంప్రదించకుండా టిడిపితో ఏకపక్షంగా పొత్తును పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
 
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, వైసీపీ ప్రభుత్వం అరాచకాలు వంటి అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించినా ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా అండగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా సహకరి స్తామని, కష్టపడి పనిచేయాలని మాత్రమే అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది.  భేటీలో ఏపీలో టీడీపీ-జనసేన రాజకీయ అవగాహన అంశం చర్చకు రాలేదని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికలు, పొత్తులకు మాత్రమే పరిమితమైనట్లు ఇరుపార్టీలు చెబుతున్నాయి. తెలంగాణలో రెండు పార్టీలు కలిసి పనిచేసే విషయం మాత్రమే చర్చకు వచ్చినట్లు తెలిసింది.

భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి బీజేపీకి మద్దతిచ్చే విషయంలో పవన్ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో ప్రాథమికంగా చర్చించామని, పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడాలని పవన్ కల్యాణ్ కోరడంతోనే ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలిపారు. జనసేన ఒక్కటే ఎన్డీయే భాగస్వామిగా ఉందని అంతవరకే చర్చలు పరిమితం అవుతాయని  స్పష్టం చేవారు. 

ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల్లో కలిసే విషయంలో ఇరుపార్టీల మధ్య ఇప్పటికే ప్రాథమిక అవగాహన కుదిరినా ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయాలనే విషయంలో స్పష్టత రాలేదు. 

కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌లతో కలిసి అమిత్‌ షాతో భేటీ అయిన పవన్ కళ్యాణ్‌ దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. 27వ తేదీన సూర్యాపేటలో బహిరంగ సభ తర్వాత అమిత్‌షా హైదరాబాద్‌లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. హైదరాబాద్‌ వచ్చేలోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్‌షా సూచించినట్లు తెలుస్తోంది. పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు అమిత్‌షాకు తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 32 సీట్లు కోరుతోంది. కనీసం 20 సీట్లకు పట్టుబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఐదారు సీట్లకు మించి వదిలేందుకు బిజెపి సుముఖంగా లేదని చెబుతున్నారు.  ఇప్పటికే బీజేపీ తెలంగాణాలో 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నవంబరు 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించిన తర్వాత రెండో జాబితాను విడుదల చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.