చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఓవైపు మరోసారి టిడిపి అధినేత చంద్రబాబునాయుడును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతుండగా, బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై గురువారమే విచారణ జరగగా ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పును సోమవారం వెల్లడించనుంది.

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపిస్తూ చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇక ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్కిల్ స్కామ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను కోర్టుకు సమర్పించారు.

చంద్రబాబుకు ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందని,. కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఖాతాకు నిధులు మళ్లించారని, ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. సీఐడీకి కోర్టు ఇచ్చిన రెండ్రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని, మరో మూడ్రోజుల కస్టడీకి ఇవ్వాలని వాదించారు. 

జీవో 4ని అడ్డం పెట్టుకుని నిదులు దిగమింగారని, ఈ కేసులో ఆడిటర్ వెంకటేశ్వర్లును విచారించాల్సి ఉందని చెప్పారు. ఈ నెల 10న సిఐడి  విచారణకు రావాలని ఆడిటర్ వెంకటేశ్వర్లుకి నోటీసులిచ్చామని, చంద్రబాబుకి బెయిల్ ఇస్తే ఆడిటర్‌ వెంకటేశ్వర్లును ప్రభావితం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.