ఏపీ హక్కులను పరిరక్షించండి.. కృష్ణా జలాలపై జగన్

ఏపీ హక్కులను పరిరక్షించండి.. కృష్ణా జలాలపై జగన్
 
కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల మధ్య మధ్య పంపిణీ చేయడం కోసం బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు తాజా విధివిధానాలను ప్రతిపాదించాలని నిర్ణయించారు. 
దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ దీనిపై ప్రధాని మోదీకి లేఖరాశారు.
తాజా విధివిధానాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలను మినహాయించి కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకే పరిమితం చేయడం భావ్యం కాదని తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ –2కు మరిన్ని విధి విధా­నాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని దీనిపై తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 ఎస్‌ఎల్‌పీలు దాఖలయ్యాయని తెలిపారు. 

సెక్షన్‌ 5(2)ప్రకారం ఆ ట్రైబ్యునల్‌ నివేదికను పక్కనపెట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని ఎస్‌ఎల్‌పీలూ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని చెబుతూ ఈ సమస్య గురించి 2021 ఆగస్టు 17, 2022 జూన్‌ 25న కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకొచ్చామని జగన్ తెలిపారు. 

2014 జులై 14న తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ విధివిధానాలను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం కృష్ణా నది ప్రవాహాలపై ఆధారపడిన ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కల్గించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, సీఎం జగన్ శుక్రవారం రాత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి కృష్ణా జలాలపై కొత్త విధివిధానాలను ప్రతిపాదించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు నిధులను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. 

పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని చెబుతూ ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన  రూ.1,355 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కోరారు.