బ్రిటన్లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామికి చేదు అనుభవం ఎదురైంది. స్కాట్లాండ్లో గురుద్వారాలోకి ప్రవేశించకుండా కొందరు ఆయనను అడ్డుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఖలిస్థానీ సానుభూతి నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ ఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
గురుద్వారా కమిటీ ఇచ్చిన ఆహ్వానంతోనే అక్కడికి వెళ్లిన భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామిని ఖలిస్థానీ మద్దతుదారులు ఆపారు. స్కాట్లాండ్లోని గురుద్వారాలోకి ప్రవేశించకుండా బ్రిటన్లోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ఖలిస్థానీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. ఈ విషయంలో ఖలిస్థానీ సానుభూతిపరులను అడ్డుకునేందుకు గురుద్వారా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరికి అక్కడి నుంచి విక్రమ్ దొరైస్వామి వెళ్లిపోయారు.
దొరైస్వామి అల్బర్ట్ డ్రైవ్లోని గ్లాస్గో గురుద్వారా కమిటీ సభ్యులతో సమావేశం కాబోతున్నారన్న విషయం తమకు ముందుగానే తెలిసిందని ఓ ఖలిస్థానీ సానుభూతిపరుడు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దొరస్వామి గురుద్వారా వద్దకు రాగానే బ్రిటన్లోని అతివాద సిక్కులు కొందరు ఆయనను అడ్డుకున్నారని తెలిపాయి.
‘గురుద్వారాకు మీకు ఆహ్వానం లేదు’ అని వారు దొరస్వామితో చెప్పారని సమాచారం. ఫలితంగా అక్కడ స్వల్ప ఘర్షణ జరిగిందని, యూకేలో ఉన్న ఏ గురుద్వారా లోపలికీ భారతీయ అధికారులకు స్వాగతం ఉండదని చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
కాగా, హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో కెనడా, భారత్ మధ్య గత కొన్నాళ్ల నుంచి వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఘటన ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. గ్లాస్గోవ్లోని ఆల్బర్ట్ రోడ్డులో ఉన్న గురుద్వారా వద్దకు దొరైస్వామి చేరుకుంటున్న సమయంలో ఖలిస్తానీ కార్యకర్తలు అడ్డుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
హై కమీషనర్ కారు పార్కింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. కారు డోర్ను ఓపెన్ చేసేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆ కారు గురుద్వారా వద్ద ఆగకుండానే వెళ్లిపోయింది. ఈ సంఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. “దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ మతం లేదా వర్గానికి చెందిన వారైనా ఇక్కడికి (గురుద్వారా) రావచ్చు.మాది హింసను విశ్వసించే మతం కాదు, బదులుగా మేము మానవాళిని రక్షించేవారిలో ఉన్నాము.సిక్కులు రక్షకులు”అని బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు.
సిక్కుల కృషిని ప్రధాని మోదీ కొనియాడారని చెబుతూ ప్రపంచంలోని ప్రతిచోటా సిక్కులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయితే, ప్రపంచంలోనే సిక్కులకు అత్యంత సురక్షితమైన ప్రదేశం భారతదేశంలోనేఅని ఆయన స్పష్టం చేశారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కూడా ఈ చర్యను ఖండించింది.ఎస్జిపిసి జనరల్ సెక్రటరీ గ్రేవాల్ మాట్లాడుతూ గురుద్వారాలోకి ప్రవేశించకుండా యుకె రాయబారిని అడ్డుకోవద్దని చెబుతూ గురుద్వారాలు ప్రతి మతానికి చెందినవని స్పష్టం చేశారు.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత