షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని, అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించి ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేస్తుందని చెప్పారు. 
 
ఇప్పటికే వివిధ పార్టీల రాజకీయ నేతలతో ఎన్నికల సంఘం సమావేశం అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో కూడా ఎన్నికల సంఘం సమావేశం అవుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులకు కూడా ఈవీఎంల పట్ల అవగాహన పెంచుతున్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు
 
తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చినట్లు సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. 3 లక్షలకు పైగా ఓట్లు రద్దయ్యాయని చెప్పారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఫారం 6, 8లు 15 వేలకు పైగా వచ్చాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పునకు ఫిర్యాదులు అధికంగా అందాయని, వాటన్నింటిపై త్వరలో చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ తెలియజేశారు.

ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు మాత్రమే ఉందని వికాస్ రాజ్ తెలిపారు. మహిళా ఓటర్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ చాలా పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని పేర్కొన్నారు. చాలా సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని చెబుతూ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే నాలుగు వేల భవనాలు గుర్తించామని తెలిపారు.