కాకతీయలో ఎబివిపి విద్యార్ధుల‌పై లాఠీఛార్జి

కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులపై స్వ‌యంగా వరంగల్ సీపీ అవుల రంగనాధ్ స‌మ‌క్షంలో పోలీసులు లాఠీ ఝులిపించడం తీవ్ర వివాదంగా మారింది. దీనితో కాకతీయ యూనివర్సిటీ లో ఉద్రిక్తత నెలకొంది.  వివిధ విభాగాలలోని పీహెచ్‌డి కేటగిరి-2 అడ్మిషన్‌లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఎబివిపి విద్యార్థి సంఘాలు బుధవారం నాడు ఆందోళన చేపట్టాయి.
ఒకానొక దశలో విద్యార్థులు వీసీ ఛాంబర్‌లోకి దూసుకువెళ్లారు. వీసీ రమేష్ , రిజిస్ట్రార్ శ్రీనివాసరావులతో వాగ్వాదానికి దిగారు.  75 శాతం అడ్మిష‌న్లను వీసీ, రిజిస్ట్రార్, ఆల్ డీన్స్ అమ్ముకున్నార‌ని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు.  దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి పర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 
 
దీంతో విద్యార్ధులంద‌రిని అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్క‌డ సీపీ రంగనాధ్ ముందు లాఠీలతో చిత్తకాబాదిన ఘటన వివాదానికి దారి తీసింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయల పాలయ్యారు.  అనంత‌రం విద్యార్ధుల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి మెడికల్ రిపోర్ట్స్ తో జిల్లా జడ్జి ముందు పోలీసులు హాజరు పరిచారు.
విద్యార్థులు జడ్జి ముందు గాయాలు చూపించి వాపోయారు. యూనివర్సిటీలో వీసి ని ప్రశ్నించిన ఏబీవీపీ విద్యార్థులు క్యాంపస్ లో కనిపిస్తే కాల్చి వేస్తానని సీపీ రంగనాధ్ భయబ్రాంతులకు గురించేశారని జడ్జి ముందు వెల్ల‌డించారు. దీంతో విద్యార్థులకు రీ మెడికల్ ఎగ్జామినేషన్ కు ఆదేశించారు న్యాయమూర్తి. విద్యార్థులను ఎంజీఎంకు పోలీసులు తరలించారు.  చేతులు, కాళ్ళు విరిగిన విద్యార్థులకు అక్కడ అత్యవసర చికిత్స కొన‌సాగిస్తున్నారు. విద్యార్ధుల‌పై లాఠీ చార్జీ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.