ప్రధాని మోదీ పట్ల 80% భారతీయుల్లో సానుకూలత

భారతీయుల్లో దాదాపు 80 శాతం మంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని, అలాగే ఇటీవలి కాలంలో తమ దేశం మరింత ప్రభావవంతమైనదిగా తయారయిందని ప్రతి పది మంది భారతీయుల్లో ఏడుగురు నమ్ముతున్నారని ప్యూ రిసెర్చ్ సెంటర్‌తాజాగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. 

భారత్‌లో జి20 శిఖరాగ్ర సదస్సు జరగనున్న తరుణంలో ఈ సర్వే విడుదల కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల ప్రజల అభిప్రాయం సాధారణంగా సానుకూలంగానే ఉందని, మీడియాలో వస్తున్న వార్తల్లో దాదాపు 46 శాతం భారత్‌కు అనుకూలమైన వార్తలే ఉంటున్నాయని, 34 శాతం వార్తలు వ్యతిరేక అభిప్రాయాలతో కూడుకుని ఉంటున్నాయని ఆ సర్వే పేర్కొంది.

16 శాతం ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవడం గమనార్హం. కాగా భారత్ పట్ల ఇజ్రాయెల్‌లో అత్యధికంగా సానుకూల అభిప్రాయం ఉంది. ఇక్కడ 71 శాతం మంది తాము భారత్ పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నామని చెప్పారని ఆ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు ఈ సర్వే నిర్వహించినట్లు ‘ప్యూ’ తెలిపింది.

భారత్ సహా 24 దేశాలో 30,861 మందిని ప్రశ్నించడంతో పాటుగా ప్రధాని మోదీ పట్ల ప్రపంచ అభిప్రాయాలు, ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడానికి ఉన్న అవకాశాలు, ఇతర దేశాల పట్ల భారతీయుల అభిప్రాయాలు లాంటి వాటిని పరిశీలించినట్లు తెలిపింది. 

భారతీయుల్లో ప్రతి పది మందిలో 8 మంది ప్రధాని నరేంద్ర మోదీ పట్ల సానుకూల అభిప్రాయాలను కలిగి ఉన్నారని, వీరిలో అత్యధిక శాతం మంది (55 శాతం) అత్యంత సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఈ సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. భారతీయుల్లో 5 శాతం మంది మాత్రమే ప్రధాని మోదీ  పట్ల ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఆ సర్వే వెల్లడించింది. 

‘భారత దేశపు శక్తి పెరుగుతోందని భారతీయుల్లో అత్యధికులు నమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో తమ దేశం మరింత ప్రభావశీలంగా మారిందని ప్రతి పది మంది భారతీయుల్లో ఏడుగురు నమ్ముతున్నారు. 2022లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఇది చాలా పెరిగింది. 19 దేశాల్లో నిర్వహించిన అప్పటి సర్వేలో 28 శాతం మంది మాత్రమే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు’ అని ప్యూ తెలిపింది. 

ఇటీవలి సంవత్సరాలలో అమెరికా ప్రభావం బలోపేతం అవుతోందని దాదాపు సగం మంది భారతీయులు (49 శాతం) చెప్పగా, రష్యా విషయంలో 41 శాతం మంది ఇదే విషయం చెప్పారని ఆ నివేదిక వెల్లడించింది. అయితే చైనా విషయంలో భారతీయుల అభిప్రాయాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది.