బ్రిక్స్ కూటమిని మరింత విస్తరించేందుకు భారత్ మద్దతు

ఏకాభిప్రాయం అధారంగా బ్రిక్స్ కూటమిని మరింత విస్తరించేందుకు భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భాగస్వామ్య దేశాల పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడాన్ని తాము స్వాగతిస్తామని తెలిపారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రసంగిస్తూఆఫ్రికన్ యూనియన్‌కు జి20లో శాశ్వత సభ్యత్వానికి తాము ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు.

బ్రిక్స్ భాగస్వామ్య పక్షాలు కూడా ఇందుకు మద్దతు తెలియజేస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తుకు బ్రిక్స్ సంసిద్ధంగా ఉండాలంటే మనం మన సమాజాలను భవిష్యత్తుకు సంసిద్ధంగా ఉంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జి20 సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నామన్న ప్రధాని బ్రిక్స్‌లోనూ అటువంటి ప్రాధాన్యత కల్పించడాన్ని స్వాగతించారు.

గ్లోబల్ సౌత్ అభివృద్ధిలో బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందన్న మోదీ గడచిన రెండు దశాబ్దాలుగా ఈ కూటమి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగుతోందని సంతోషం వ్యక్తం చేశారు.  రైల్వే రిసెర్చ్‌నెట్‌వర్క్, ఎంఎస్‌ఎంఇల మధ్య సహకారం, స్టార్టప్ రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై భారత్ చేసిన సూచనలతో ఎంతో పురోగతి కనిపిస్తోందని ప్రధాని చెప్పారు.

ఈ సదస్సులో అంతకు ముందు మాట్లాడిన ప్రధాని మోదీ  భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి వివరించారు.  బ్రిక్స్ కూటమి దేశాలు అంతరిక్ష పరిశోధనల కోసం కన్సార్టియంను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. చంద్రయాన్ 3 చంద్రునిపై అడుగిడిన చారిత్రాత్మక రోజునే,  కొన్ని గంటల ముందు ఈ సూచన చేయడం గమనార్హం.

నేలపై మువ్వన్నెల కాగితం
కాగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా గ్రూపు ఫొటో దిగడానికి వచ్చిన మోదీకి  అక్కడ నేలపై మన జాతీయ పతాకం రంగులతో ఉన్న ఓ కాగితం కనిపించింది. తాము నిలబడే దగ్గర ఆ కాగితం ఉండడంతో ప్రధాని వెంటనే స్పందించారు. దాన్ని తీసుకుని తన జేబులో వేసుకున్నారు. ఆయా దేశాల నేతలు ఎక్కడ నిలబడాలో సూచించడం కోసం ఆయా దేశాల జెండాలను పోలిన కాగితాలను ఉంచారు. 

మోదీ చేసిన పనిని చూసిన పక్కనే ఉన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్ ఫోసా కూడా ఆయన మార్గాన్నే అనుసరించారు. అక్కడున్న తమ జాతీయ జెండాను పోలిన కాగితాన్ని తీసి సహాయకులకు అందజేశారు. తమ జాతీయ జెండా పట్ల ప్రధాని చూపిన గౌరవాన్ని అక్కడ హాజరైన అతిథులందరి ప్రశంసలను అందుకుంది.

రామ్‌ఫోన్సాతో మోదీ  చర్చలు
కాగా బ్రిక్స్ సదస్సులు పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ బుధవారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్ ఫోసాతో సమావేశమయ్యారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటుగా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకాకుండా గ్లోబల్ సౌత్ వాణిని ఎలోపేతం చేయడానికి ఇరుదేశాలు కలిసి ఎలా పని చేయాలనే దానిపైనా చర్చించారు.

‘ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, పర్యవరణ పరిరక్షణ ప్రజల మధ్య సంబంధాలు సహా వివిధ రంగాల్లో సాధించిన పురోగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు’ అని విదేశాంగ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.