`జెన్ జెడ్’ తప్పు దోవపట్టించే ప్రయత్నాలతో రాజీనామా చేశా!

`జెన్ జెడ్’ తప్పు దోవపట్టించే ప్రయత్నాలతో రాజీనామా చేశా!
 

 * ఒడిశాకు ప్రతిష్ట కలిగించే పనులు చేయకపోవచ్చు.. తలవంపులు తేలేదు!

నీట్ యుజి పరీక్షలో అక్రమాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిజెపి) నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంపై స్పందిస్తూ, ‘జెన్-జెడ్’ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరగడమే తన రాజీనామాకు కారణమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజుల తర్వాత, తాను ఎందుకు తప్పుకున్నారో ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 
 
“జెన్-జెడ్ మన పిల్లలే. కొందరు వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. నాకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలూ లేవు,” అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన భారీ నిరసనల మధ్య పదవి నుంచి తప్పుకున్న సరిగ్గా రెండు వారాల తర్వాత, భువనేశ్వర్‌లోని జీఎం యూనివర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాన్ తన రాజీనామాపై మౌనం వీడారు. 
 
సంబల్‌పూర్ లోక్‌సభ సభ్యుడైన ప్రధాన్, తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి కేంద్ర మంత్రిమండలి నుంచి రాజీనామా చేశానని చెప్పారు. ఆ పదవి తనకు ముఖ్యం కాదని, భారతదేశాన్ని ‘విశ్వ గురువు’గా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన నొక్కి చెప్పారు.
 
 “జెన్-జెడ్ మన పిల్లలే. కొందరు వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. అప్పుడు నాకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలూ లేవు. భారతదేశంలో ప్రతి సంవత్సరం కనీసం రెండు కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారు. గత 10 ఏళ్లలో 20 కోట్ల మంది పిల్లలు జన్మించారు. వారికి ఆశయాలు ఉన్నాయి, వారే భారతదేశాన్ని ‘విశ్వ గురువు’గా మారుస్తారు. ఆ పదవి నాకు ముఖ్యం కాదు,” అని ప్రధాన్ తెలిపారు. 
 
సిజెపి నిరసనలు మొదలైన దాదాపు నెల రోజుల తర్వాత, జూలై 25న ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో, ఈ సమస్య తనకు ఎప్పుడూ “వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం” కాదని ప్రధాన్ పేర్కొన్నారు. బాధ్యతాయుత భావనతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని పునరుద్ఘాటించారు. ఆందోళనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించిన తర్వాత, సిజెపి ప్రధాన్ రాజీనామాను తమ విజయంగా అభివర్ణించి నిరసనలను విరమించింది. 
 
రైరాఖోల్‌లో జరిగిన మరో సమావేశంలో, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌పై ప్రధాన్ విమర్శలు గుప్పించారు. బిజెడి కార్యకర్తల నిరసనలు,”వెనక్కి వెళ్ళండి”  అనే నినాదాలు తనను ఏమాత్రం కలవరపెట్టలేదని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయం వద్ద బిజెపియువజన, విద్యార్థి విభాగం కార్యకర్తలు “ధర్మేంద్ర ప్రధాన్ వెనక్కి వెళ్ళిపో” అంటూ నినాదాలు చేస్తూ చేపట్టిన నిరసనను ప్రస్తావిస్తూ, ఆయన ఇలా చెప్పుకొచ్చారు: 
 
“నేను ఒక రైతు బిడ్డను. మీరు నన్ను వెనక్కి వెళ్ళిపొమ్మని చెప్పినా, నేను మళ్ళీ తిరిగి వస్తాను.” తనపై నిరసనల్లో యువతను పాల్గొనేలా చేస్తున్నారని బిజెడిఅధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తూ, “నవీన్ బాబు నన్ను ఒడిశా ప్రజలకు అవమానకరమైన వ్యక్తిగా, చెడ్డవాడిగా అభివర్ణిస్తుంటారు,” అని ప్రధాన్ పేర్కొన్నారు. “ఒడిశా ప్రజలకు తలవంపులు తెచ్చే పనిని నేను ఎప్పుడైనా చేశానా?” అని ఆయన ప్రశ్నించగా, అక్కడి ప్రజల నుండి “లేదు” అనే గట్టి సమాధానం వచ్చింది.
 
“నేను రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురాకపోవచ్చు, కానీ నా పనుల ద్వారా ప్రజలకు ఎప్పుడూ అవమానం కలిగించలేదు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే పనిని నేను ఎప్పటికీ చేయను,” అని ఆయన స్పష్టం చేశారు. జగన్నాథ స్వామి మరియు సంబల్‌పూర్ ఆరాధ్య దైవమైన సమలేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో 12 ఏళ్ల క్రితం తాను కేంద్ర మంత్రిని అయ్యానని ప్రధాన్ చెప్పారు. బిజెడి ఎమ్మెల్యే, ఒడిశా అసెంబ్లీలో ఆ పార్టీ ఉప నాయకుడైన ప్రసన్న ఆచార్య కూడా హాజరైన వేదిక నుండే పట్నాయక్‌పై ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.